
సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్లో కూటమి పాలనలో దిగజారిన ఆర్థిక పరిస్థితిపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. 2025-26 ఆర్థిక సంవత్సరపు మొదటి త్రైమాసికంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తీవ్రంగా దిగజారిందని గణాంకాలతో సహా పేర్కొన్నారాయన.
కాగ్ విడుదల చేసిన మంత్లీ కీ ఇండికేటర్ ప్రకారం.. రాష్ట్ర ఆర్థిక స్థిరత్వం ప్రమాదంలో ఉందని వైఎస్ జగన్ అభిప్రాయపడ్డారు. ఆ నివేదికలో.. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయ వనరులు (పన్నులు, పన్నేతర ఆదాయాలు) అత్యంత మందగమనం చూపించాయని అన్నారాయన. జీఎస్టీ, సేల్స్ టాక్స్ ఆదాయాలు గత సంవత్సరం ఇదే కాలంతో పోల్చితే తక్కువగా ఉన్నాయని తెలిపారు.
- ఆదాయాలు లేకపోగా శరవేగంగా అప్పులు పెరుగుతున్నాయ్
- ప్రభుత్వ విధానాలతో ఏపీ అప్పుల్లో కూరుకుపోయింది
- మొదటి త్రైమాసికంలో రాష్ట్రంపై ఆర్థిక ఒత్తిడి ఏర్పడింది
- ఏపీలో ఆర్థిక స్థిరత్వం, నిర్వహణ సరిగా లేనేలేదు
- విభజనతో మొదలైన సమస్య మరింత తీవ్రరూపం దాల్చింది
- ఏపీలో అవినీతి విపరీతంగా పెరిగిపోయింది
- ఖజానాకు రావాల్సిన ఆదాయం రాకుండా పోతోంది
- పన్ను ఆదాయం, పన్నేతర ఆదాయాలు పేలవంగా ఉన్నాయి

- గతేడాది త్రైమాసికంతో పోలిస్తే ఈ ఏడాది.. జీఎస్టీ ఆదాయాలు, అమ్మకపు పన్ను ఆదాయాలు తక్కువగా ఉన్నాయి
- కొన్ని శాఖల్లో అత్యంత అధ్వాన్నమైన వృద్ధిరేటు ఉంది
- రాష్ట్ర సొంత ఆదాయాలు కేవలం 3.47 శాతం మాత్రమే పెరిగాయి
- కేంద్రం నుంచి వచ్చే ఆదాయాలతో సహా మొత్తం ఆదాయాలు 6.14 శాతం మాత్రమే పెరిగింది
- అప్పులు మాత్రం మూడు నెలల్లో ఏకంగా.. 15.61శాతం వేగంతో పెరిగాయి

ఇది ఏపీపై ఆర్థిక ఒత్తిడికి సంకేతం అని జగన్ అన్నారు. అలాగే.. చంద్రబాబు ప్రభుత్వం ఖర్చులు, సొంత ఆదాయాలపై కాకుండా అప్పులపై ఆధారపడుతున్నాయని, ఇది ఆర్థిక స్థిరత్వానికి ప్రమాదకరంగా మారిందని జగన్ అభిప్రాయపడ్డారు.
Fiscal stress worsens in the first quarter of this financial year
The CAG uploaded the Monthly Key Indicators for the first quarter of this financial year and these figures very clearly suggest a precarious outlook for the financial stability of the State Government, Public… pic.twitter.com/0tYnKfNSQi— YS Jagan Mohan Reddy (@ysjagan) July 26, 2025
వైఎస్సార్సీపీ హయాంలో అప్పులపై చంద్రబాబు చేసిన తప్పుడు లెక్కల ప్రచారం(రూ.14 లక్షల కోట్లంటూ..) గురించి తెలిసిందే. అంతేకాదు.. ఆ సమయంలో ఏపీ మరో శ్రీలంక అయిపోతోందంటూ గగ్గోలు పెట్టారాయన. అయితే మొత్తంగా జగన్ ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో చేసిన అప్పులు రూ.3,39,580 కోట్లు మాత్రమేనని కూటమి ప్రభుత్వంలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. ఇంకోవైపు.. ప్రతీ మంగళవారాన్ని అప్పుల వారంగా మార్చేసుకున్న చంద్రబాబు, కేవలం 12 నెలల్లోనే 1,37,546 లక్షల కోట్ల అప్పు చేయడం విశేషం.
