హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓటమి.. ట్రెండింగ్‌లో ‘జిలేబీ’ | Whats viral Jalebi connection To Congress in Haryana elections | Sakshi
Sakshi News home page

హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓటమి.. ట్రెండింగ్‌లో రాహుల్‌ ‘జిలేబీ’

Oct 8 2024 8:45 PM | Updated on Oct 9 2024 3:55 PM

Whats viral Jalebi connection To Congress in Haryana elections

హర్యానా  అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌కు ఊహించని షాక్‌నిచ్చాయి. ఎగ్జిట్‌ పోల​ ఫలితాలతో గెలుపుపై గంపెడు ఆశలు పెట్టుకున్న హస్తం పార్టీకి అధికారిక ఫలితాలు కోలుకోలేని దెబ్బని మిగిల్చాయి. కేవలం 37 స్థానాలకే పరిమితమైంది. హర్యానా పోరులో బీజేపీ ఊహించని విజయాన్ని సొంతం చేసుకుంది.90 స్థానాలకు గానూ 48 చోట్ల విజయ కేతనం ఎగురవేసి  మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్దమైంది.

హర్యాణా ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓటమి పాలవడంతో నెట్టింట జిలేబీ ట్రెండ్‌ అవుతోంది. ఎన్నికల ప్రచారంలో సందర్భంగా జిలేబీ తయారీపై రాహుల​ గాంధీ చేసిన వ్యాఖ్యలను ఇప్పుడు బీజేపీ శ్రేణులు ట్రోల్‌ చేస్తున్నాయి.
 చదవండి:తీర్పును అంగీకరించడం లేదు: హర్యానా ఫలితాలపై కాంగ్రెస్‌

హర్యానాలోని గోహనలో తయారయ్యే మాతూరాం 'జిలేబీ'లకు చాలా ప్రత్యేకత ఉంది. ఎన్నికల ప్రచారం సందర్భంగా రాహుల్‌ జిలేబీ ప్రస్తావన తెస్తూ..పెద్దఎత్తున ఈ జిలేబీలను దేశవ్యాప్తంగా తయారు చేసి అమ్మకాలు జరపాలని, విదేశాలకు సైతం వీటిని సరఫరా చేయాలని అన్నారు. జిలేబీ ఫ్యాక్టరీతో మరిన్ని ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు.  20,000 వేల మందిని 50,000 వేల మందికి ఉపాధి దొరుకుతుందన్నారు. మాతూరాం వంటి వ్యాపారులు కేంద్ర ప్రభుత్వ పెద్దనోట్ల రద్దు, జీఎస్‌టీ చర్యలతో ఇబ్బందులు ఎదుర్కొన్నారని పేర్కొన్నారు.

అయితే రాహుల్ చెప్పిన జిలేబీ ఫ్యాక్టరీపై బీజేపీ ఛలోక్తులు విసిరింది. జిలేబీలు వేడివేడిగా తయారు చేస్తారని, అసలు ఆ స్వీట్ తయారీ ఎలాగో కూడా కూడా రాహుల్‌కు తెలియదని విమర్శలు గుప్పించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గత నెలలో హర్యానాలో జరిపిన ఎన్నికల ప్రచారలోనూ గోహన జిలేబి ప్రస్తావన చేశారు. విపక్ష కూటమి అధికారంలోకి వస్తే వారివద్ద ఐదేళ్లలో ఐదుగురు ప్రధానులను మార్చే ఫార్ములా ఉందని, ప్రధాని పదవి ఏమైనా మాథురామ్‌ జిలేబీనా పంచుకోవడానికి అని ప్రశ్నించారు.

Advertisement
 
Advertisement
Advertisement