
తణుకు అర్బన్: నరసాపురం ఎంపీ పదవికి రాజీనామా చేసి పోటీకి దిగితే మీపై వలంటీరును పోటీకి పెట్టి విజయం సాధిస్తామని తణుకు ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఎంపీ కనుమూరి రఘురామకృష్ణరాజుకు సవాల్ విసిరారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
► అధికార పార్టీ ఎంపీగా ఉంటూ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న మీరు ఎన్నికలకు దిగితే ఒక వలంటీరును మీపై పోటీకి దింపి గెలిపించే సత్తా మాకుంది. సీఎం జగన్ బొమ్మతో గెలిచి ఆయనకే మతాన్ని అంటగట్టేలా మాట్లాడుతున్న మీరు దమ్ముంటే రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లాలి.
► కరోనా వైరస్కు ముందే నియోజకవర్గాన్ని విడిచి ఢిల్లీ, హైదరాబాద్లో ఉంటున్న మిమ్మల్ని నరసాపురం పార్లమెంట్ పరిధిలోని ప్రజలు మరిచిపోయారు. తణుకు నియోజకవర్గంలోనే పీఎం రిలీఫ్ ఫండ్స్ సుమారుగా రూ.8 లక్షలు వరకు వచ్చి ఉన్నా ఆ నిధులను వినియోగించే పరిస్థితిలో మీరు లేరు.
► అన్ని మతాలకు సమన్యాయం చేసేలా అర్చకులు, ఫాదర్స్, ఇమామ్లకు సంక్షేమం అందిస్తున్న సీఎం వైఎస్ జగన్ని ఉద్దేశించి మతం రంగు అంటించేలా మాట్లాడడమే కాకుండా కరోనా సమయంలో వినాయక చవితి మండపాలు పెట్టుకోనివ్వలేదని కనుమూరి ఆరోపించడం ఎంతవరకు సమంజసం? 18 నెలల పాలనలోనే బెస్ట్ సీఎంగా నిలిచిన వ్యక్తికి మతం రంగు అంటించి మత విద్వేషాలు రెచ్చగొట్టేలా రఘురామ ఉన్మాదిలా మాట్లాడుతున్నారు. చంద్రబాబు చేతిలో ఎంపీ కనుమూరి కీలుబొమ్మగా మారారు.