కోల్కతా: తృణమూల్ కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మే 4న ఓట్ల లెక్కింపులో కౌంటింగ్ సూపర్ వైజర్లు, సహాయకులుగా కేవలం కేంద్ర ప్రభుత్వం, పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ ఉద్యోగులను మాత్రమే నియమించాలన్న ఎన్నికల కమిషన్ నిర్ణయాన్ని సవాలు చేసి.. అత్యవసర విచారణ కోరింది. న్యాయమూర్తులు పీఎస్ నరసింహా, జోయ్మాల్య బాగ్చీతో కూడిన ప్రత్యేక ద్విసభ్య బెంచ్ శనివారం కేసును విచారించనుంది.
రెండో దశ పోలింగ్ సమయంలో ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో టీఎంసీ సుప్రీంకోర్టుకు వెళ్లింది. బయటి నుంచి వచ్చిన పరిశీలకులు, బెంగాల్కు పరిచయంలేని పోలీసు సిబ్బంది అంతా టీఎంసీ కార్యకర్తలను లక్ష్యంగా పెట్టుకుని నియమితులైనవారేనని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. ఆమె వ్యాఖ్యలతో ఇప్పటికే ఉద్రిక్తంగా ఉన్న రాజకీయ వాతావరణం మరింత ఉద్రిక్తమైంది. రెండో దశ పోలింగ్ సమయంలో టీఎంసీ, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి.
ప్రతి కౌంటింగ్ టేబుల్ వద్ద ఆ ఉద్యోగి
ఇటీవల పశ్చిమ బెంగాల్ అదనపు ముఖ్య ఎన్నికల అధికారి (సీఈఓ) ఒక ప్రకటన జారీ చేశారు. ప్రతి కౌంటింగ్ టేబుల్ వద్ద కౌంటింగ్ సూపర్వైజర్ లేదా సహాయకుల్లో కనీసం ఒకరు కేంద్ర ప్రభుత్వం లేదా పీఎస్యూ ఉద్యోగి ఉండాలని పేర్కొన్నారు. ఈ ఆదేశాన్ని టీఎంసీ సవాలు చేసింది. ఇలాంటి ఆదేశం ఎన్నికల కమిషన్ మాత్రమే జారీ చేయగలదని, అదనపు సీఈఓకు ఆ అధికారం లేదని ‘లైవ్ లా’ వెబ్సైట్ నివేదించింది.
ఎన్నికల కమిషన్ హ్యాండ్బుక్లో కౌంటింగ్ సూపర్వైజర్, సహాయకులుగా కేంద్ర సిబ్బంది తప్పనిసరి అని చెప్పలేదని పార్టీ వాదించింది. మైక్రో పరిశీలకులను సాధారణంగా కేంద్ర సేవల నుంచి తీసుకున్నప్పటికీ, అదే నిబంధనను కౌంటింగ్ సిబ్బందికి కూడా తీసుకురావడం పశ్చిమ బెంగాల్కు మాత్రమే ప్రత్యేకమా? అని టీఎంసీ అడిగింది.
పక్షపాత ధోరణి కనబర్చే అవకాశం ఉందని ఆరోపించింది. కేంద్ర ప్రభుత్వం ఒక రాజకీయ పార్టీ అధీనంలో ఉండటం వల్ల కేంద్ర ఉద్యోగులు ప్రభావితమయ్యే అవకాశం ఉందని, దాంతో లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ దెబ్బతింటుందని పేర్కొంది.
ముందు టీఎంసీ కలకత్తా హైకోర్టుకు వెళ్లగా ఆ పార్టీ చేసిన ఈ వాదనలను ఉన్నత న్యాయస్థానం తిరస్కరించింది. ఎన్నికల కమిషన్ హ్యాండ్బుక్ ప్రకారం కౌంటింగ్ సిబ్బందిని కేంద్ర లేదా రాష్ట్ర సేవల నుంచి నియమించవచ్చని పేర్కొంది. సిబ్బంది ఎంపిక ఎన్నికల అధికారుల స్వేచ్ఛాధికార పరిధిలోకి వస్తుందని ‘లైవ్ లా’ తెలిపింది.
‘పక్షపాతం’ అంటూ చేసిన ఆరోపణలను కొట్టిపారేస్తూ, కౌంటింగ్ ప్రక్రియలో ఇప్పటికే అనేక రక్షణ చర్యలు ఉన్నాయని హైకోర్టు తెలిపింది. మైక్రో పరిశీలకులు, అభ్యర్థులు నియమించిన కౌంటింగ్ ఏజెంట్లు, సీసీటీవీ పర్యవేక్షణ వంటి వ్యవస్థలు ఉన్నాయని పేర్కొంది. టీఎంసీ వ్యక్తం చేసిన అనుమానాలకు ఆధారాలు లేవని చెప్పింది.
ఇలాంటి ఎన్నికల సంబంధిత సవాళ్లపై గత విచారణలను హైకోర్టు ప్రస్తావించింది. కేవలం అనుమానం ఆధారంగా న్యాయ జోక్యం సాధ్యం కాదని హైకోర్టు పేర్కొని పిటిషన్ను కొట్టివేసింది. దీంతో టీఎంసీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
రెండో దశ పోలింగ్ సమయంలో ఉద్రిక్తతలు పెరిగాయి. టీఎంసీ, బీజేపీ పరస్పరం ఆరోపణలు చేసుకున్నాయి. పలు నియోజకవర్గాల్లో ప్రత్యర్థి అనుచరుల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. భద్రతా బలగాల పెంపుపై అధికార పార్టీ విమర్శలు చేసింది.


