సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మైనారిటీ సదస్సు నిర్వహించారు. మైనారిటీల సమస్యలు, పార్టీ బలోపేతం సహా పలు అంశాలపై చర్చించారు. పార్టీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, మైనారిటీ నేతలు ఖాదర్ భాషా, హసీఫ్ ఖాన్, ఎమ్మెల్సీలు రుహుల్లా, నిస్సార్ భాషా, నూరీ పాథిమా సహా పలువురు మైనారిటీ ప్రతినిధులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు దుర్మార్గపు పాలన, అరాచకాలపై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ‘‘వైఎస్ జగన్ అన్ని వర్గాలకూ న్యాయం చేస్తే.. చంద్రబాబు అందరినీ మోసం చేశారని.. వివిధ రాజకీయ శక్తులు ఏకమై అబద్ధాల ప్రచారంతో అధికారాన్ని చేజిక్కించుకున్నారు. ఈ రెండేళ్ల పాలనలో ప్రజలను పూర్తిగా వంచించారు. సూపర్ సిక్స్ హామీలు అమలు చేయకుండా గాలిలో కలిపేశారు. ప్రజా సమస్యలను పక్కనపెట్టి వ్యక్తిగత విమర్శలు, రాజకీయ దూషణలకే పరిమితమయ్యారు’’ అంటూ సజ్జల దుయ్యబట్టారు.
‘‘చివరికి మోసపోయిన డీఎస్సీ అభ్యర్థులపై కూడా విమర్శలు చేయటం దుర్మార్గం. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో లక్షలాది ఉద్యోగాలను ఎలాంటి వివాదాలకు తావులేకుండా భర్తీ చేశాం. కానీ చంద్రబాబు పదహారు వేల ఉద్యోగాలకు కూడా సరిగా పరీక్షలు నిర్వహించలేకపోయారు. మైనారిటీలకు వైఎస్సార్సీపీ ఎప్పుడూ అండగా నిలుస్తుంది. ఎస్ఐఆర్ ప్రక్రియపై పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలి

..వైఎస్సార్సీపీ అనుకూల ఓట్లను తొలగించే ప్రయత్నాలను అడ్డుకోవాలి. జూన్ 15 నుంచి ప్రారంభమయ్యే ఇంటింటి సర్వేపై ప్రజల్లో అవగాహన కల్పించాలి. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసి పార్టీ బలాన్ని చాటాలి. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకు భవిష్యత్తులో తగిన గుర్తింపు ఉంటుంది’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.


