
వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి ‘సజ్జల’
సాక్షి, అమరావతి: వచ్చే ఎన్నికల్లో టీడీపీ 2019 ఎన్నికల కంటే ఘోరంగా ఓడిపోవడం ఖాయమని.. రాజకీయ తెరమీద ఆ పార్టీ పూర్తిగా కనుమరుగు కాబోతోందన్నది స్పష్టంగా కనిపిస్తుండడంతో దాని అధ్యక్షుడు చంద్రబాబు తీవ్ర నిరాశ ని స్పృహలతో శివాలెత్తిపోతున్నారని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు ఫ్ర్రస్టేషన్ ఫ్రకాష్టకు చేరిందనేది వారం రోజులుగా ఆయన చేష్టలు చూస్తుంటే అర్థమవుతోందని.. ఆయన కలలుగన్న కూటమి, పొత్తు వికటించడంతో చంద్రబాబు ఏం చేస్తున్నారో ఆయనకే తెలియడంలేదని ఎద్దేవా చేశారు.
తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పొత్తు, సీట్ల ఖరారు నుంచి అభ్యర్థుల ఎంపిక వరకూ కూటమిలో ఉన్న పార్టీలు తన కింద పనిచేసేవిగా చంద్రబాబు భావిస్తున్నారని.. అందుకే ఆయన అనుకున్నవారే ఆయా పార్టీల్లో అభ్యర్థులు అవుతున్నారన్నారు. దీంతో బీజేపీ, జనసేనలను నమ్ముకున్న వారందరూ మండిపడుతున్నారని.. కూటమిలో జరుగుతున్న గొడవలు, గందరగోళాలే అందుకు నిదర్శనమన్నారు. ఫలితంగా ఎన్నికల తర్వాత టీడీపీ అడ్రస్ గల్లంతు కావడం ఖాయమన్నారు.ఆయన ఇంకా ఏమన్నారంటే..
ఓటమి భయంతో వ్యవస్థలపై దాడి..
ఘోర పరాజయం ఖాయమని ఆందోళన చెందుతున్న చంద్రబాబు తిట్లకు దిగుతూ.. వ్యవస్థలపై దాడిచేస్తున్నారు. చివరికి పిచ్చి పాటలు పెట్టుకుని డాన్స్లు కూడా వేస్తున్నాడు. 74 ఏళ్ల వ్యక్తి ఇలాగేనా చేసేది? ప్రజలు ఎన్నుకున్న ఒక సీఎం గురించి పిచ్చివాడిలా పిచ్చి మాటలు మాట్లాడుతున్న చంద్రబాబు.. జనం ఉమ్మేస్తారనే ఇంగితం కూడా లేకుండా సైకోలా ప్రవర్తిస్తున్నాడు.
2019లో సీఎంగా ఉన్న చంద్రబాబు అప్పటి సీఈవో గోపాలకృష్ణ ద్వివేదిపై ఏ విధంగా చిందులు వేశాడో అందరూ చూశారు. కానీ, జగన్ ఒక వ్యవస్థపై ఇలా మాట్లాడిన సందర్భాలు ఎన్నడూ చూడలేదు. ఈ రోజు వీళ్లు ఎడాపెడా ఫిర్యాదులిస్తుంటే బదిలీలు చేస్తున్నారు. వారి ఫిర్యాదుల్లో అవాస్తవాలున్నా ఆ వ్యవస్థను జగన్ ఎన్నడూ మాట్లాడలేదు. ఎన్నికల కమిషన్ పరిధిలోకి వెళ్లాక వారి విచక్షణాధికారాన్ని ప్రశ్నించకూడదనే గౌరవాన్ని సీఎం జగన్ పాటిస్తున్నారు. ఇక ఈసీకి ఫిర్యాదు చేసి వలంటీర్లనైతే ఆపావగానీ పింఛన్లను ఆపలేవుగా బాబూ? శక్తి ఉంటే అవి కూడా ఈ సిటిజన్స్ ఫర్ డెమెక్రసీ లాంటి సంస్థలతో ఆపించే వాడేగానీ ధైర్యం చాలలేదు.
టెర్రరిజంలా ఎల్లో గ్యాంగ్ అరాచకం..
చంద్రబాబే శాశ్వత సీఎంగా ఉండాలని పెడితే తప్ప చంద్రబాబు, రామోజీ, రాధాకృష్ణ, పురందేశ్వరి, లోకేశ్, దత్తపుత్రుడులకు మనసు శాంతించదేమో. రామోజీరావుకు మార్గదర్శి కేసు నడుస్తున్నప్పటి నుంచీ ఆయన తట్టుకోలేకపోతున్నాడు. ఈరోజు మళ్లీ ‘సీఎస్ గారూ’.. అంటూ రాసుకొచ్చాడు. ముసుగు తొలగించి నేరుగా దాడికి దిగారు. ఇక పురందేశ్వరి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉన్నా.. ఆమె అజెండా మాత్రం చంద్రబాబుదే. రాష్ట్రంలో ఉన్న అధికారులందరినీ తీసేయాలంటూ ఈసీకి లేఖ రాసింది.
పెయిడ్ ఆర్టిస్టులా షర్మిల మాటలు..
ఇక తెలంగాణనే తన జీవితమన్న షర్మిల ఎందుకిక్కడికి వచ్చారు? ఇక్కడ ఎత్తిపోయిన కాంగ్రెస్ బాధ్యతలను ఆమెకెవరు అప్పగించారు? అదే కాంగ్రెస్ను తెలంగాణలో విపరీతంగా తిట్టి ఇప్పుడెలా కలిశారు? ముందు వీటికి సమాధానాలు చెప్తే.. వివేకా హత్య, ఆమె తీసుకున్న పాత్రకు జవాబు కూడా దానిలోనే ఉంటుంది. నాలుగేళ్లుగా పట్టని వివేకా హత్య ఈ రోజు ఎందుకు పట్టింది? కోర్టు పరిధిలో ఉన్న అంశాలు తేలకముందే హంతకుడు అని ముద్ర వేస్తున్నారు. షర్మిల చంద్రబాబు అజెండాను భుజానకెత్తుకుంది. అందుకే షర్మిలను పెయిడ్ ఆర్టిస్తు అనాల్సి వస్తోంది.