పాట్నా: మరో ఐదు రోజుల్లో రాజ్యసభ సభ్యునిగా ప్రమాణి స్వీకారం చేయబోతున్న బిహార్ సీఎం నితీష్ కుమార్ స్థానంలో కొత్త సీఎంను ఎంపిక చేసే ప్రక్రియ వేగమంతమైంది. ఈ నెల 10వ తేదీ నితీష్ కుమార్ రాజ్యసభ సభ్యునిగా బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ఈ తరుణంలో అక్కడ సీఎం పోస్ట్ ఖాళీ కానుంది. అయితే స్థానాన్ని త్వరలోనే పూర్తి చేస్తామని బిహార్ బీజేపీ అధ్యక్షుడు సంజయ్ సరోగి స్పష్టం చేశారు. ఆ బాధ్యతను ఎన్డీఏ తీసుకుంటుందని పేర్కొన్నారు.
‘ నితీష్ కుమార్ గత వారమే శాసన మండలి సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయనను రాజ్యసభ సభ్యునిగా ఎంపిక చేసిన క్రమంలో కౌన్సిల్ సభ్యునిగా రాజీనామా చేశారు. ఈ తరుణంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ బిహార్ సీఎంను ఎంపిక చేసే పనిలో పడింది. ఇందులో నూతన సీఎం ఎంపిక చేసే ప్రక్రియలో నితీష్ కుమార్ కూడా పాలు పంచుకుంటారు’ అని తెలిపారు.
కాగా, మార్చి 16న నితీష్ కుమార్ రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 101, 190 ప్రకారం.. ఒక వ్యక్తి ఏకకాలంలో అటు పార్లమెంటులోనూ, ఇటు రాష్ట్ర శాసనసభ లేదా మండలిలోనూ సభ్యునిగా కొనసాగకూడదు. 1950 నాటి ‘ప్రొహిబిషన్ ఆఫ్ సైమల్టేనియస్ మెంబర్షిప్’ నిబంధనల ప్రకారం, ఎన్నికైన 14 రోజుల లోపు ఏదో ఒక పదవిని వదులుకోవాల్సి ఉంటుంది. ఈ గడువు మార్చి 30 (సోమవారం) నాటితో ముగియనుండటంతో, చివరి రోజున ఆయన తన ఎమ్మెల్సీ పదవికి నితీష్ రాజీనామా చేశారు. కేబినెట్ మంత్రి విజయ్ కుమార్ చౌదరి ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించారు.
రేసులో ఉన్నది ఎవరు..?
నితీష్ కుమార్ రాజ్యసభకు వెళ్తుండటంతో బిహార్ తదుపరి ముఖ్యమంత్రి పీఠంపై ఉత్కంఠ నెలకొంది. ముఖ్యమంత్రి రేసులో సామ్రాట్ చౌదరి, నిత్యానంద్ రాయ్ తదితర అగ్రనేతల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. నితీష్ కుమార్ ప్రస్తుత బాధ్యతలకు సంబంధించి రానున్న కొద్ది రోజుల్లో పార్టీ నుంచి మరిన్ని కీలక ప్రకటనలు వచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.


