‘వెన్నుపోటుకు కేరాఫ్‌ అడ్రస్‌ చంద్రబాబు’ | Lakshmi Parvathi Slams Chandrababus Vendetta Politics | Sakshi
Sakshi News home page

‘వెన్నుపోటుకు కేరాఫ్‌ అడ్రస్‌ చంద్రబాబు’

Sep 1 2026 6:43 PM | Updated on Sep 1 2026 6:55 PM

Lakshmi Parvathi Slams Chandrababus Vendetta Politics

హైదరాబాద్‌: చంద్రబాబు జీవితమంతా అబద్ధాల మయమేనని,  ఎన్నికలకు ముందు సంక్షేమం.. గెలిచాక పచ్చి మోసం చేయడమమే ఆయన నైజమని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీపార్వతి ధ్వజమెత్తారు. ’విజనరీ’ అనే పదాన్ని కూడా చోరీ చేసిన ఘనుడు ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబేనని, ఇతరుల ప్రాజెక్టులకు శిలాఫలకాలు వేసి క్రెడిట్‌ కొట్టేసే వ్యక్తి అంటూ విమర్శించారు. 

నందమూరి తారక రామారావుకు వెన్నుపోటు పొడిచి, తెలుగుదేశం పార్టీని, ఆయన పదవిని లాక్కుని, సరిగ్గా 31 ఏళ్ల క్రితం ఇదే రోజు సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశారని, అందుకే వెన్నుపోటుకు కేరాఫ్‌ అడ్రస్‌ చంద్రబాబునాయుడు అని మండిపడ్డారు.. అలా అడ్డదారిలో గద్దెనెక్కిన చంద్రబాబు, ఆనాటి నుంచి ఇప్పటి వరకు ఏ మాత్రం నైతిక విలువలు లేని రాజకీయాలు చేస్తున్నారని ఆమె గుర్తు చేశారు.  హైదరాబాద్‌లోని తన నివాసంలో నందమూరి లక్ష్మీపార్వతి మీడియాతో మాట్లాడుతూ.. 

మహనీయుడు ఎన్టీఆర్‌ అయితే ద్రోహి చంద్రబాబు
ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మహిళా యూనివర్సిటీ తీసుకువచ్చారు. ఉద్యోగాల్లో మహిళలకు 9 శాతం, స్థానిక సంస్థల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించారు. మునసబు, కరణాల వ్యవస్థను రద్దు చేసి పరిపాలనను గ్రామ స్థాయికి తీసుకువెళ్లిన గొప్ప నేత ఆయన. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా దేశంలోని పార్టీలన్నింటినీ ఏకం చేసి, నేషనల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు చేసి వీపీ సింగ్‌గారిని ప్రధానిని చేసిన మహానుభావుడు. 1994 ఎన్నికల్లో 222 సీట్లు, కమ్యూనిస్టులతో కలిపి ఏకంగా 258 స్థానాలతో అఖండ మెజారిటీ సాధించారు. అలాంటి గొప్ప వ్యక్తికి ఎనిమిది నెలలు తిరక్కుండానే చంద్రబాబు ద్రోహం చేశాడు.

వెన్నుపోటుకు కేరాఫ్‌ అడ్రస్‌ చంద్రబాబు
ఆ రోజుల్లో ఎన్టీఆర్‌ ఆరోగ్యం బాగాలేక ప్రాణాపాయ స్థితిలో ఉంటే.. చంద్రబాబు మాత్రం వైస్రాయ్‌ హోటల్లో ఎమ్మెల్యేలతో మందు, మాంసంతో విందులు, వినోదాలు చేసుకున్నారు. ఆగస్టు 25వ తేదీన ఎన్టీఆర్‌ గారిని పార్టీ అధ్యక్ష పదవి నుంచి అన్యాయంగా తొలగించి, పార్టీ ఫండ్‌ను ఆపేశారు. తండ్రిని జైల్లో పెట్టిన ఔరంగజేబు లాంటివాడు చంద్రబాబు. సెప్టెంబర్‌ 1న అడ్డదారిలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి వెన్నుపోటుకు కేరాఫ్‌ అడ్రస్‌గా మిగిలిపోయారు.

చంద్రబాబు జీవితమంతా అబద్ధాల మయమే
చంద్రబాబు జీవితమంతా అబద్ధాలే. ఎన్నికలకు ముందు సంక్షేమం అంటాడు, గెలిచాక ఏ పనీ చేయక, పచ్చి మోసం చేయడం చంద్రబాబు నైజం. చివరకు విజనరీ అనే పదాన్ని కూడా ఆయన చోరీ చేశాడు. భోగాపురం ఎయిర్‌ పోర్ట్, వెలిగొండ తదితర ప్రాజెక్టులను వేరే వాళ్ళు కడితే.. ముందుగా శిలాఫలకాలు వేసి, ఆ క్రెడిట్‌ అంతా తాను కొట్టేసే ప్రయత్నం చేస్తున్నాడు. రాజకీయాల్లో ఈ స్థాయిలో దిగజారి ఎవరూ వ్యవహరించరు, ఒక్క చంద్రబాబు తప్ప. తన కొడుకు లోకేష్‌ స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీలో చదివినట్లు కనీసం ఆ సర్టిఫికెట్‌ కూడా చూపించుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నాడు.

వ్యవస్థలను మేనేజ్‌ చేయడంలో దిట్ట
ఎన్టీఆర్‌ చనిపోయే చివరి క్షణం వరకు, చంద్రబాబు ఆయనను తీవ్ర క్షోభకు గురి చేశాడు. తన చేతిలో ఉన్న మీడియాను,  ఢిల్లీలో కాంగ్రెస్‌ను మేనేజ్‌ చేసి ఎన్నికల సంఘం ద్వారా పార్టీ సింబల్‌ను కూడా లాక్కున్నాడు. అసలు ఎన్టీఆర్‌ ఫొటోలు పెట్టుకునే అర్హత కూడా చంద్రబాబుకు లేదు. నాడు ఎన్టీఆర్‌పై ఏ విధంగా కుట్రలు చేశాడో, ఈరోజు జగన్‌పై కూడా అలాగే కుట్రలు చేస్తూ కుటుంబ సభ్యులను దూరం చేసే ప్రయత్నం చేస్తున్నాడని నందమూరి లక్ష్మీపార్వతి ఆక్షేపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement