
మేడ్చల్ బీఆర్ఎస్ విజయోత్సవ సభలో మాట్లాడుతున్న కేటీఆర్
ఘట్కేసర్/సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ కార్యకర్తల వెన్నంటే ఉంటామని, రాష్ట్రంలో ఎవరికి అన్యా యం జరిగినా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలం అండగా నిలుస్తామని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అన్నారు. శుక్రవారం మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం కొర్రెముల్లో ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన బీఆర్ఎస్ విజయోత్సవ సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు, 420 హామీలు అమలు చేయలేమని సీఎం హోదాలో రేవంత్రెడ్డి చేతులెత్తేశారని అన్నారు. రుణమాఫీ కోసం రైతులు, ప్రత్యేక బస్సుల కోసం పురుషులు ఎదురు చూస్తున్నారని, ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు. ‘మూడు ఫీట్లు లేనోడు కేసీఆర్ను, బీఆర్ఎస్ను వంద ఫీట్ల లోతులో బొందపెడతాడట, ఇటువంటి తీస్మార్ ఖాన్లను ఎంతో మందిని చూశాం, ఈయన ఎంత’అని అన్నారు.
ఇండియా కూటమి ఖాళీ..
ఇండియా కూటమిలో ప్రస్తుతం ఎవరూ లేరని మమతా బెనర్జీ, నితీశ్కుమార్, కేజ్రీవాల్, కేరళలో సీపీఎం వాళ్లు వెళ్లిపోయారని, అఖిలేశ్యాదవ్ తన దారి తాను చూసుకుంటున్నారని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. భారత్ జోడో యాత్ర తర్వాత ఆ కూటమిలో చివరికి రాహుల్ గాంధీ ఒక్కరే మిగులుతారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ వచ్చేది లేదు, సచ్చేది లేదని, ఇప్పుడు ఆ పార్టీ ఉన్న పరిస్థితిలో గతంలో ఉన్న 50, 55 ఎంపీ సీట్లు కూడా గెలుచుకోలేదని ఆయన అభిప్రాయపడ్డారు.
బీజేపీని ఆపే సత్తా కాంగ్రెస్కు లేదు
కేంద్రంలోని బీజేపీ సర్కారును ఆపే సత్తా కాంగ్రెస్కు లేదని కేటీఆర్ అన్నారు. తెలంగాణకు జీవనాధారమైన కృష్ణా, గోదావరి జలాల వాటాలు తేల్చే సమయం ప్రధాని మోదీకి లేదని, మరో పక్క సీఎం రేవంత్రెడ్డి కృష్ణా జలాలపై బోర్డుకు హక్కులు కల్పిస్తూ తెలంగాణను ఢిల్లీలో తాకట్టుపెట్టారని ధ్వజమెత్తారు. భవిష్యత్తులో ఏ ప్రాజెక్టు నిర్మించాలన్నా, చుక్క నీరు తీసుకోవాలన్నా ఢిల్లీ అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు చామకూర మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్రెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, బీఆర్ఎస్ రాష్ట్ర నేత భద్రారెడ్డి పాల్గొన్నారు.
కాంగ్రెస్ తప్పుడు ప్రచారం: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 6956 స్టాఫ్ నర్సు పోస్టులు, 15,750 పోలీసు కానిస్టేబుళ్ల పోస్టుల భర్తీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తోందని బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె.తారకరామారావు మండిపడ్డారు. ఉద్యోగాల భర్తీ ఘనత తమదేనని చెప్పుకుంటూ ప్రజలను పిచ్చోళ్లను చేస్తోందని పేర్కొన్నారు. ఈ ఉద్యోగాల భర్తీతో కాంగ్రెస్ పారీ్టకి ఏమాత్రం సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే ఈ పోస్టులను మంజూరు చేసి పరీక్షలు నిర్వహించామని చెప్పారు. ఫలితాలు ప్రకటించి, ఉద్యోగ నియామకాలు చేపట్టే సమయంలో దురదృష్టవశాత్తు ఎన్నికల నియమావళి రావడంతో ప్రక్రియ ఆగిపోయిందని ‘ఎక్స్’వేదికగా వెల్లడించారు. అసత్యాలు చెప్పడం కాంగ్రెస్కు ఇదే తొలిసారి కాదు.. చివరిసారి కూడా కాదని తారకరామారావు అన్నారు.
ఆటో డ్రైవర్ల కుటుంబాలను ఆదుకోవాలి
రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకున్న ఆటో డ్రైవర్ల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు డిమాండ్ చేశారు. ఒక్కో బాధిత కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించాలన్నారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి శుక్రవారం బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రవ్యాప్తంగా ఆటో డ్రైవర్లు మీ వల్ల ఇవాళ రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆటోలకు గిరాకీ లేక కుటుంబాల పోషణ భారంకావడంతో 15 మంది ఆటోడ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్నారంటే.. పరిస్థితి ఎంత చేజారిందో అర్థమవుతోందని కేటీఆర్ పేర్కొన్నారు. గురువారం ఓ గిరిజన ఆటోడ్రైవర్ బేగంపేటలోని ప్రజాభవన్ వద్ద ఆటోను తగలబెట్టుకున్న సంఘటనతో ప్రతి ఒక్కరి గుండె బరువెక్కిందని విచారం వ్యక్తం చేశారు. ఆటో డ్రైవర్ల సమస్యలపై ప్రభుత్వానికి నివేదిక పంపించామని, కానీ ఇప్పటి వరకు స్పందన లేదని ఆరోపించారు. ఆటో డ్రైవర్లకు ప్రతినెలా రూ.10 వేల లెక్కన ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు. డ్రైవర్ల సమ స్యలు పరిష్కరించకపోతే ఆరున్నర లక్షల మంది ఆటో డ్రైవర్లతో కలసి ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని, ప్రభుత్వం మెడలు వంచి ఆటోడ్రైవర్లకు న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు.