సాక్షి, జగిత్యాల: జగిత్యాల జీవన్ రెడ్డి ఎపిసోడ్పై తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ అధికారంలోకి వచ్చాక కొన్ని విషయాలు జీవన్ రెడ్డికి ఇబ్బందిగా మారాయి. ఆయన పార్టీ మారరు అనే ఆశిస్తున్నట్టు చెప్పుకొచ్చారు. మరోవైపు.. జీవన్ రెడ్డి అనుచరులు ఆయన ఇంటిపై ఉన్న “ఇందిరా భవన్” ఫ్లెక్సీని తొలగించడం గమనార్హం.
కాగా, కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి రాజీనామా నేపథ్యంలో నేడు ఆయన నివాసానికి పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, ఏఐసీసీ చీఫ్ సచిన్ సావంత్, విప్ ఆది శ్రీనివాస్ వచ్చారు. ఈ క్రమంలో రాజీ కుదిర్చే ప్రయత్నం చేశారు. అనంతరం, మహేష్ కుమార్ సాక్షి టీవీతో మాట్లాడారు. ఈ సందర్బంగా మహేష్ కుమార్ గౌడ్..‘పార్టీ రాజకీయ నిర్ణయాలతో జీవన్ రెడ్డి ఇబ్బంది పడ్డారు. జీవన్ రెడ్డికి, ఆయన అనుచరులకు అన్యాయం జరిగిందన్న ఆవేదన ఆయన మాటల్లో వ్యక్తమైంది.
ప్రభుత్వం సాఫీగా నడవాలంటే కొన్ని పనులు, నిర్ణయాలు చేయాల్సి ఉంటుంది. ఆ క్రమంలోనే కలిసి వచ్చిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ అభివృద్ధికి ఆకర్షితులయ్యారు. అదే జీవన్ రెడ్డికి ఇబ్బందిగా మారినట్టు ఉంది. జీవన్ రెడ్డితో పార్టీ పరంగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా మంచి సంబంధాలున్నాయి. జీవన్ రెడ్డి పార్టీ మారవద్దని చెప్పి వచ్చాం. మొన్ననే నేను శ్రీధర్ బాబుతో కలిసి రావాల్సింది. మీనాక్షి నటరాజన్తో కూడా మాట్లాడించాం. ఆయన పార్టీ మారరు అనే ఆశిస్తున్నాం. ఆయనకు కచ్చితంగా కాంగ్రెస్ పార్టీ భవిష్యత్లో ఆయన అనుభవానికి తగిన న్యాయం చేస్తుంది అంటూ వ్యాఖ్యలు చేశారు.
మరోవైపు.. తన నివాసం నుంచి మహేష్ కుమార్ గౌడ్ వెళ్లిపోయిన వెంటనే జీవన్ రెడ్డి బయటకు వచ్చారు. ఈ సందర్బంగా జీవన్ రెడ్డి.. కాంగ్రెస్ పార్టీలో ఇదే నా చివరి రోజు అని సంచలన ప్రకటన చేశారు. రేపు సమావేశం యథావిధిగా ఉంటుందని తెలిపారు. ఇదే సమయంలో జీవన్ రెడ్డి ఇంటి పైన ఇందిరా భవన్ అనే పేరుతో ఉన్న ఫ్లెక్సీలను కార్యకర్తలు తొలగించారు. అయితే, ఇందిరా గాంధీ మీద అభిమానంతో తన ఇంటికి ఇందిరా భవన్ అని పేరు పెట్టుకుని ఇంతకాలం పార్టీ కార్యకలాపాలు కొనసాగించిన జీవన్ రెడ్డి. ఇవాళ ఆ పేరుతో ఉన్న ఫ్లెక్సీ కూడా తొలగించారు. దీంతో పార్టీకి పూర్తిస్థాయిలో గుడ్బై చెబుతున్నట్టు అనుచరులు సంకేతాలు ఇచ్చారు.


