పొత్తు చిచ్చు.. కాంగ్రెస్‌ను వీడిన బిహార్‌ మాజీ చీఫ్‌ | Former Bihar Congress president Anil Sharma quits party | Sakshi
Sakshi News home page

పొత్తు చిచ్చు.. కాంగ్రెస్‌ను వీడిన బిహార్‌ మాజీ చీఫ్‌

Apr 1 2024 9:39 AM | Updated on Apr 1 2024 1:18 PM

Former Bihar Congress president Anil Sharma quits party - Sakshi

పాట్నా: లోక్‌సభ ఎన్నికలకు ముందు బిహార్‌లో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఆర్‌జేడీతో పొత్తును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు అనిల్ శర్మ పార్టీని వీడారు. ఆర్‌జేడీతో వినాశకరమైన పొత్తులో కాంగ్రెస్‌ పార్టీ ఇరుక్కుపోయిందని ఆయన వ్యాఖ్యానించారు. 

ఇక్కడ విలేకరుల సమావేశంలో అనిల్‌ శర్మ కాంగ్రెస్‌ పార్టీని వీడుతున్నట్లు ప్రకటన చేశారు. వివాదాస్పద మాజీ ఎంపీ రాజేష్ రంజన్ అలియాస్ పప్పు యాదవ్‌ను ఇటీవల ఆర్భాటంగా పార్టీలోకి చేర్చుకోవడాన్ని ఆయన తప్పుపట్టారు. “ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన అవసరం గురించి మాట్లాడుతున్న కాంగ్రెస్‌ పార్టీలో దురదృష్టవశాత్తూ ప్రజాస్వామ్యం కనిపించదు.  పార్టీ జాతీయ అధ్యక్షుడు కూడా రాహుల్ గాంధీ లేదా అతని సన్నిహితుడు కేసీ వేణుగోపాల్‌ను సంప్రదించకుండా ఎటువంటి నిర్ణయం తీసుకోలేరు” అని శర్మ ఆరోపించారు.

దాదాపు దశాబ్ద కాలంలో పార్టీని వీడిన నాల్గవ మాజీ బిహార్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా శర్మ నిలిచారు. 2018లో అశోక్ చౌదరి పార్టీని వీడి జేడీయూలో చేరారు. అంతకుముందు, 2015లో రామ్ జతన్ సిన్హా కాంగ్రెస్‌ను విడిచిపెట్టారు. అంతకు ముందు సంవత్సరం, మెహబూబ్ అలీ కైజర్ ఎల్‌జేపీలో చేరారు.

"నేను 1985లో కాంగ్రెస్‌లో చేరాను. దాదాపు నాలుగు దశాబ్దాలలో రెండుసార్లు సంస్థాగత పదవులను నిర్వహించాను. రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేశాను. నేనెప్పుడూ టిక్కెట్ కోసం గానీ, శాసన మండలి బెర్త్ కోసం గానీ లాబీయింగ్ చేయలేదు. అలాగే కాంగ్రెస్‌ను వీడే ముందు మరే ఇతర పార్టీలో అవకాశాలను అన్వేషించలేదు" అని అనిల్‌ శర్మ చెప్పుకొచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement