కోల్కతా: సాధారణంగా రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారితే.. గత పాలన తాలూకు ఆనవాళ్లు చెరిపేయడం, లేదంటే ఆ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు పేర్లు మార్చి క్రెడిట్ కొట్టేసి తామే చేశామని చెప్పుకునే ఈ రోజుల్లో పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారి అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. మాజీ సీఎం మమతా బెనర్జీ తన పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాల్ని కొనసాగిస్తున్నట్లు ప్రకటించారు.
దీదీ ప్రభుత్వం 2021లో మహిళా సాధికారత పథకం లక్ష్మీర్ బండార్ అందుబాటులోకి తెచ్చింది. ఈ పథకం కింద అర్హులైన 25 నుంచి 60 సంవత్సరాల మధ్య వయస్సు గల మహిళలకు, ముఖ్యంగా ఎస్సీ/ఎస్టీలకు నెలకు రూ.1200, సాధారణ వర్గాలకు రూ.1000 ఆర్థిక సహాయం నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లోకి జమ చేసేవారు.
ఇటీవల ఎన్నికల్లో బీజేపీ విజయ దుందుభి మోగించింది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తొలిసారి బీజేపీ అధికారంలోకి రాగా.. ఆ రాష్ట్రానికి తొమ్మదవ సీఎంగా సువేందు ప్రమాణ స్వీకారం చేపట్టారు. పాలనలో తనదైన మార్క్తో నిర్ణయాలు తీసుకుంటున్నారు.
సోమవారం పశ్చిమ బెంగాల్ కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆరు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వాటిలో లక్ష్మీర్ బండార్ పథకాన్ని కొనసాగిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. గత టీఎంసీ నేతృత్వంలోని పశ్చిమ బెంగాల్ అమలు చేసిన లక్ష్మీర్ బండార్లాంటి సంక్షేమ పథకాల్ని కొనసాగిస్తున్నట్లు చెప్పారు.దీంతో పాటు ఎన్నికల్ని సజావుగా నిర్వహించిన ఎన్నికల సంఘానికి కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల్లో ప్రాణాలు కోల్పోయిన ఓ బీజేపీ కార్యకర్తకు నివాళులర్పించారు.


