సాక్షి,ఢిల్లీ: తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్కు ఐదు పేజీల రాజీనామా లేఖ ఇచ్చారు. ఆ లేఖలో తమిళనాడులో బీజేపీ ఫెయిల్యూర్ గల కారణాల్ని వివరించారు. దీంతో పాటు ఐపీఎస్ పదవిని వదులుకొని బీజేపీలో చేరిన పరిస్థితులు, ప్రస్తుత పరిస్థితులపై ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
మంగళవారం న్యూఢిల్లీలో అన్నామలై బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితీన్ నబీన్, పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ బీఎల్ సంతోష్తో భేటీ అయ్యారు. ఈ భేటీలో అన్నామలై తన రాజీనామా లేఖ అందించారు. రాజీనామాతో అన్నామలై బీజేపీ, ద్రవిడ పార్టీలకు ప్రత్యామ్నాయంగా సెక్యులర్, తమిళ్ ఫస్ట్ అనే నినాదంతో వచ్చే వారంలో పార్టీ ప్రకటన ఉండొచ్చని తమిళ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి.
ఐపీఎస్ అధికారిగా పనిచేసి రాజకీయాల్లోకి వచ్చిన అన్నామలైకి ప్రస్తుతం బీజేపీలో భవిష్యత్తు కనిపించడం లేదనే వాదన ఆయన సన్నిహితుల ద్వారా బయటకొచ్చింది. ఈ క్రమంలో ఆయన అధిష్టానం ఇచ్చిన పలు ఆఫర్లను తిరస్కరించినట్లు సమాచారం. మొదట ఒక సామాజిక-రాజకీయ ఉద్యమాన్ని ప్రారంభించి.. అనంతరం కొత్త రాజకీయ పార్టీని స్థాపించాలనే ఆలోచనలో అన్నామలై ఉన్నారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. సమాన భావజాలం కలిగిన వ్యక్తులను ఒకే వేదికపైకి తీసుకువచ్చి బలమైన వాలంటీర్ నెట్వర్క్ను నిర్మించడమే లక్ష్యంగా ఈ ఉద్యమం సాగనుంది. ప్రస్తుతం ఆయన నిర్వహిస్తున్న ‘వీ ది లీడర్స్’ సంస్థే భవిష్యత్ రాజకీయ ప్రాజెక్టుకు పునాదిగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.


