● మూడు దుకాణాలకు బల్దియా జరిమానా
కోల్సిటీ(రామగుండం): నాణ్యతలేని వస్తువులతో ఆహార పదార్థాలు తయారు చేయడంతోపాటు నిషేధిత ప్లాస్టిక్ వినియోగిస్తున్న మూడు వ్యాపార సంస్థలకు రామగుండం బల్దియా జరిమానా విధించింది. మున్సిపల్ కమిషనర్ అరుణశ్రీ ఆదేశాల మేరకు శనివారం ప్రజారోగ్య విభాగం అధికారులు లక్ష్మీనగర్ ప్రాంతంలోని పలు దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా లీలా బార్ అండ్ రెస్టారెంట్లో నాసిరకం పదార్థాలతో వంటలు తయారు చేస్తున్నట్లు గుర్తించి రూ.5,000 జరిమానా విధించారు. అలాగే నిషేధిత ప్లాస్టిక్ వస్తువులు ఉపయోగిస్తున్న వైష్ణవి స్వీట్స్ అండ్ బేకరీ సెంటర్కు రూ.3,000, లిమ్రా ఫ్రూట్ జ్యూస్ సెంటర్కు రూ.3,000 చొప్పున జరిమానా విధించారు. ఈ తనిఖీల్లో శానిటరీ ఇన్స్పెక్టర్లు నాగభూషణం, సంపత్, ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్ మధూకర్, జూనియర్ అసిస్టెంట్ చంద్రారెడ్డి, జవాన్లు దయానంద్, అశోక్ పాల్గొన్నారు.
రైతులకు రాజన్న కోడెలు
వేములవాడఅర్బన్: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని సన్న, చిన్నకారు రైతులకు వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి దేవస్థానానికి సంబంధించిన గోశాల కోడెలు ఉచితంగా పంపిణీ చేస్తామని కలెక్టర్ గరీమా అగ్రవాల్ శనివారం తెలిపారు. తిప్పాపూర్లోని గోశాలలో 300 కోడెలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయన్నారు. ఏప్రిల్ 7న రైతులకు పంపిణీ చేస్తామని తెలిపారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని రైతులు కోడెలను పొందేందుకు అర్హులని స్పష్టం చేశారు. కోడెల కోసం 1.5 నుంచి 5 ఎకరాల వరకు సాగు భూమి ఉన్న సన్న, చిన్నకారు రైతులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచి ంచారు. వివిధ ధ్రువీకరణపత్రాలతో https://rajannasirici lla.telangana.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అర్హులైన రైతులకే జియో ట్యాగింగ్ కోడెలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. కోడెలు తీసుకెళ్లే రైతులు వాటి సంరక్షణ బాధ్యతను సక్రమంగా చూసుకోవాలని సూచించారు. కో డెలు పక్కదారి పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
టెన్త్ పరీక్షలు ప్రశాంతం
పెద్దపల్లి: జిల్లావ్యాప్తంగా శనివారం పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని జిల్లా విద్యాశాఖ అధికారి శారద తెలిపారు. గణితం పరీక్షకు 7,495 మంది విద్యార్థులకు 7486 మంది హాజరయ్యారని, 99.9శాతం హాజరు నమోదు అయ్యిందని వివరించారు.


