పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి మండలం రాంపల్లి, మారెడుగొండ గ్రామాల్లోని ఎల్లమ్మతల్లి ఆలయాల్లో శనివారం తెల్లవారు జామున చోరీలు జరిగాయి. అమ్మవారి విగ్రహంపై ఆభరణాలు, హుండీలు ఎత్తుకెళ్లారు. ఆలయ ప్రధాన గేటుకు వేసిన తాళాలను పగుల గొట్టి లోనికి చొరబడ్డారు. రాంపల్లి గ్రామంలో ఇటీవలే ఆలయాన్ని నిర్మించుకున్నారు. మారెడుగొండ ఆలయం వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో నిందితుడు గేటుకు వేసిన తాళం పగులగొట్టి లోనికి వెళ్లే దృశ్యాలు రికార్డయ్యాయని స్థానికులు తెలిపారు. ఈ విషయమై తమకు ఇంకా ఫిర్యాదు అందలేదని రూరల్ ఎస్సై మల్లేశ్ తెలిపారు.
హామీలు అమలు చేయాలి
గోదావరిఖని: తెలంగాణ ఉద్యమకారులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని తెలంగాణ ఉద్యమ వేదిక డిప్యూటీ చైర్మన్ తోడేటి శంకర్గౌడ్, తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొడ్డు రవీందర్ డిమాండ్ చేశారు. శనివారం స్థానిక ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ఆరు గ్యారెంటీలలో భాగంగా ఉద్యమకారులకు కూడా అనేక హామీలు ఇచ్చిందని గుర్తుచేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడిచినా ఏఒక్క హామీ అమలు చేయలేదని విమర్శించారు. ప్రతీ ఉద్యమకారునికి గుర్తింపు కార్డులు, 250 చదరపు గజాల ఇంటి జాగ, ఇల్లు కట్టుకోడానికి రూ.10 లక్షలు ఆర్థిక సాయం, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, ప్రభుత్వ కార్యాలయాల్లో కాంట్రాక్టులకు రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి మోసం చేసిందని ధ్వజమెత్తారు. సమావేవంలో నాయకులు రాగం శీను, పొన్నం విజయ్గౌడ్, గంగారపు శాంత, లక్ష్మి, అనుముల కళావతి, తోడేటి స్వరూప తదితరులు పాల్గొన్నారు.
పెన్షన్ డబ్బుల కోసం వచ్చి మృత్యువాత
సిరిసిల్ల అర్బన్: పెన్షన్ తీసుకొని సంతోషంగా ఇంటికి వెళ్తున్న క్రమంలో వాహనం రూపంలో మృత్యువు ఆ వృద్ధురాలిని కానరాని లోకాలకు తీసుకెళ్లిన సంఘటన శనివారం చోటుచేసుకుంది. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని పెద్దబోనాలకు చెందిన దానవేని నర్సవ్వ(80) పెన్షన్ డబ్బులు తీసుకునేందుకు స్థానిక బైపాస్రోడ్డు పక్కన ఉన్న బ్యాంకుకు వెళ్లింది. పెన్షన్ తీసుకొని ఇంటికొస్తుండగా కామారెడ్డి నుంచి వేములవాడ వైపు వెళ్తున్న కారు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందింది. కాలు విరిగి దూరంలో ఎగిరిపడింది. మధ్యాహ్నం ఇంటి నుంచి వెళ్లి నర్సవ్వ రాత్రయినా తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు బైపాస్ రోడ్డు వెంట గాలించడంతో మృతిచెంది కనిపించింది. నర్సవ్వకు ముగ్గురు కూతుళ్లు, ఒక కుమారుడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


