ధర్మారం(ధర్మపురి): బొమ్మారెడ్డిపల్లి శివారులోని సాయి మార్క్ ఇటుకబట్టీని మేడారం జూనియర్ సివిల్ జడ్జి, జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్క్లాస్ సివిల్ కోర్టు జడ్జి మట్ట సరిత, తహసీల్దార్ శ్రీని వాస్, ఎస్సై ప్రవీణ్కుమార్తో కలిసి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇటుకబట్టీలో పనిచేస్తున్న ఒడిశా రాష్ట్రానికి చెందిన కార్మికుల జీవన పరిస్థితులు, పనిప్రదేశంలో సౌకర్యాలు పరిశీలించా రు. లేబర్ చట్టాలకు విరుద్ధంగా కార్మికులకు వేతనాలు చెల్లిస్తున్నారని, కనీస వసతులు కల్పించడం లేదని జడ్జి గుర్తించారు. దీంతో వారిని అక్కడి నుంచి కోర్టు ప్రాంతానికి తరలించారు. అనంతరం వారిపరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. కార్మికుల అభ్యర్థన మేరకు ఒకరోజు వసతి కల్పిస్తున్నట్లు జడ్జి తెలిపారు. జిల్లా జడ్జి సునీత ఆదేశాల మేరకు ఒడిశాకు తరలించనున్నట్లు జడ్జి సరిత తెలిపారు.
ఉదయం నుంచి రాత్రి వరకూ పనులు..
కొందరు కూలీలు ఇటుకబట్టీలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను జడ్జి దృష్టికి తీసుకెళ్లారు. ఒక్కొక్కరికి ఆర్నెల్లకు రూ.50 వేల చొప్పున అడ్వాన్స్ ఇచ్చి ఇక్కడకు తీసుకొస్తారని పేర్కొన్నారు. రోజూ ఉదయం 4 గంటల నుంచి 9 గంటల వరకు, మళ్లీ సాయంత్రం 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు తమతో పనిచేయిస్తున్నారని ఆవేదన చెందారు. ఆరోగ్యం సహకరించకున్నా కనికరించకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని కన్నీటిపర్యంతమయ్యారు. కార్యక్రమంలో కోర్టు సూపరింటెండెంట్ గడ్డం పుష్పలత, సిబ్బంది శ్రీహిత, రాజకొమురయ్య, చంద్రమౌళి, జ్యోతి పాల్గొన్నారు.
క్షేత్రస్థాయిలో తనిఖీ చేసిన మేడారం సివిల్ జడ్జి సరిత
లేబర్యాక్ట్కు విరుద్ధంగా కార్మికుల వేతనాలు
కనీసవసతులు లేవని గుర్తింపు


