● బందోబస్తు మధ్య గోదావరిఖని కోర్టులో హాజరు
గోదావరిఖని: సంచలనం సృష్టించిన ఏటీఎం చోరీ నిందితుడిని చెన్నయ్ పోలీసులు శుక్రవారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి తీసుకొచ్చారు. 2024 ఫిబ్రవరిలో స్థానిక గంగానగర్, గౌతమినగర్ ఏటీఎంలలో చోరీ జరిగింది. అదే సమయంలో పోలీస్ సైరన్ మోగడంతో గంగానగర్లో చోరీ విఫలమైంది. అయితే, గౌతమినగర్ ఏటీఎంలో సుమారు రూ.25లక్షలు చోరీకి గురయ్యాయి. ఎన్టీపీసీ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. దేశవ్యాప్తంగా అనేక ఏటీఎంలలో చోరీలకు పాల్పడిన వారికోసం విచారణ జరపగా.. నిందితుడు చెన్నయ్ పోలీసులకు చిక్కాడు. విచారణలో గౌతమినగర్ ఏటీఎంలో చోరీచేసినట్లు అంగీకరించడంతో కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పర్చేందుకు ఇక్కడకు తీసుకొచ్చారు. ప్రత్యేక ఎస్కార్ట్ పోలీసుల మధ్య కోర్టులో హాజరు పర్చిన అనంతరం శుక్రవారం రాత్రి రైలులో మళ్లీ చెన్నయ్ తీసుకెళ్లారు. దేశవ్యాప్తంగా ఏటీఎం చోరీల్లో సుమారు రూ.5కోట్లకుపైగా నిందితుడు తస్కరించినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈమేరకు పూర్తిస్థాయిలో విచారణ నిర్వహిస్తున్నారు. నిందితుడిని గోదావరిఖని వన్టౌన్ పోలీసుస్టేషన్కు తీసుకురాగా ‘సాక్షి’ కెమెరా ఆ దృశ్యాన్ని బంధించింది.
అట్టహాసంగా ఆవిష్కృత్ సాంకేతిక పండుగ
రామగిరి(మంథని): మంథని జేఎన్టీయూలో శుక్రవారం ఆవిష్కృత్ –2026 సాంకేతిక పండుగ అట్టహాసంగా ప్రారంభమైంది. ప్రిన్సిపాల్ బులుసు విష్ణువర్ధన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రెండు రోజులపాటు జరిగే టెక్ ఫెస్ట్ ప్రారంభించారు. ఆరుబ్రాంచ్ల విద్యార్థులు కాలేజీని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. టెక్నికల్ ఈవెంట్స్తో పాటు నాన్ టెక్నికల్ ఈవెంట్స్ను నిర్వహించారు. విద్యార్థులు నూతన ఆవిష్కరణలు తయారు చేసి ప్రదర్శనలో పెట్టారు. సింగరేణి మైన్స్ రెస్క్యూ స్టేషన్ సిబ్బంది తమ పరికరాల గురించి వివరించారు. కమాన్పూర్ జెడ్పీ హైస్కూల్ విద్యార్థులు టెక్నికల్ ఫెస్ట్ తిలకించారు. అనంతరం విద్యార్థులు చేసిన నృత్యాలు అకట్టుకున్నాయి. వైస్ ప్రిన్సిపాల్ ఎం.ఉదయ్ కుమార్, మెకానికల్ ప్రొఫెసర్ చెరుకు శ్రీధర్రెడ్డి, పరిపాలనాధికారి సుమన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఎన్టీపీసీ భద్రత సమష్టి బాధ్యత
జ్యోతినగర్(రామగుండం): ఎన్టీపీసీ భద్రత సమష్టి బాధ్యత అని జనరల్ మేనేజర్ ముకుల్ రాయ్ అన్నారు. జా తీయ భద్రతా వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం ర్యాలీ నిర్వహించారు. ప్లాంట్లోని అన్ని కార్యకలాపాల్లో ఉ ద్యోగులు అప్రమత్తంగా ఉండాలన్నా రు. ప్రమాదాలను నివారించడానికి భద్రతా విధానాలకు కట్టుబడి ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా కాంట్రాక్టు కార్మికుడు సారయ్య ఎన్టీపీసీ సంస్థ ప్రవర్థన, భద్రతపై పాడిన పాట ఆకట్టుకుంది.
తగ్గిన పత్తి ధర
పెద్దపల్లిరూరల్: స్థానిక వ్యవసాయ మార్కెట్యార్డులో శుక్రవారం పత్తి ధర గురువారంతో పోల్చితే స్వల్పంగా తగ్గింది. గురువారం క్వింటాల్కు గరిష్టంగా రూ.7,111 ధర పలుకగా.. శుక్రవారం రూ.6,808కు పడిపోయింది. కనిష్టంగా రూ.5,202, సగటు రూ.6,303గా నిర్ధారించినట్లు మార్కెట్ కార్యదర్శి ప్రవీణ్రెడ్డి తెలిపారు. రైతుల నుంచి 342 క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేసినట్లు ఆయన వివరించారు.


