సాక్షి పెద్దపల్లి: యాసంగి సీజన్ చివరిదశకు చేరుకుంటున్నా రైతుభరోసా డబ్బులు బ్యాంకు ఖాతా ల్లో జమకాక అన్నదాతలు ఇబ్బందిపడుతున్నారు. భారీవర్షాలతో వానాకాలంలో పంటలు నష్టపోయి న రైతుల చేతిలో డబ్బులు లేకపోవడంతో పెట్టుబ డి సాయం పడుతుందనేఆశతో అప్పులు తెచ్చి మ రీ యాసంగి సాగు చేశారు. గత యాసంగి సీజన్కు సంబంధించిన రైతుభరోసా సాయం పూర్తిగా విడుదలకాలేదని, అలాగే అదేఏడాది వానాకాలం సీజన్ లో రైతుభరోసాను మూడెకరాల వరకు మాత్రమే పరిమితం చేశారని వాపోతున్నారు. మునిసిపల్ ఎన్నికల సమయంలో ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే రైతుభరోసా సొమ్మును రైతుల బ్యాంకు ఖా తాల్లో జమచేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో అన్నదాతల్లో ఆశలు చిగురించాయి. వారిఆశలు మరోసారి నీరుగారేలా ప్రభుత్వం రైతుభరోసాపై ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడంతో ఆర్థిక ఇ బ్బందులు ఎదుర్కొంటున్నారు.
స్పష్టత లేక ఎదురుచూపులు
రైతుభరోసా ద్వారా ఎకరాకి రూ.6 వేల చొప్పున 2025 వానాకాలం సీజన్లో 1,51,057 మంది రైతులకు రూ.161.2కోట్లు జమచేశారు. అంతకుమందు యాసంగి సీజన్లో మూడెకరాల వరకు భూములు కలిగిన 1,14,313 మంది రైతుల ఖాతాల్లో రూ.42 కోట్లు జమచేశారు. పంటలు సాగుచేసే భూములను గుర్తించి.. అలాంటి రైతుల ఖాతాలకు పెట్టుబడి సాయం అందించాలని ప్రభుత్వం తొలుత శాటిలైట్ మ్యాపింగ్తోపాటు వ్యవసాయ సిబ్బంది క్షేత్రస్థాయిలో చేపట్టే క్రాప్బుకింగ్ సర్వేను కూడా పరిగణనలోకి తీసుకుని ఈపథకాన్ని వర్తింపజేయా లని నిర్ణయించింది. అయితే, ఈ సర్వే పకడ్బందీగా జరగలేదని, తూతూమత్రంగా సాగిందని భావించిన ప్రభుత్వం.. మూడెకరాలు కలిగిన వారికే రైతుభరోసా నిధులు జమచేసింది. ఈసీజన్లో ఇప్పటివరకు దీనిపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో యాసంగిలో 2.40 లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్న అన్నదాతల పెట్టుబడి సాయం కోసం ఎదురు చూడక తప్పడంలేదు.
మున్సిపల్ ఎన్నికలు ముగిసినా..
మున్సిపల్ ఎన్నికల కోడ్ గతనెల 16న ముగిసింది. అదేనెల 23వ తేదీన జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశంలో చర్చకు రాకపోవడం, రైతుభరోసా ప్రస్తావన లేకపోవడంతో అన్నదాతలు తీవ్రఅసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పరిషత్ ఎన్నికలు ఆలస్యం కావడంతోనే రాష్ట్ర ప్రభుత్వం రైతుభరోసా పెట్టుబడవి సాయం నిలిపి వేసిందన్న చర్చ కూడా ప్రస్తుతం సాగుతోంది. అసెంబ్లీ సమావేశాల తర్వాతే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికలకు, రైతుభరోసాకు ముడిపెట్టడంతో రైతులు తీవ్రఅవస్థలు పడుతున్నారు. ఈనెల 4న అన్ని జిల్లాల కలెక్టర్లతో హైదరాబాద్లో సమావేశం ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఈ సమావేశంలో వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాల ప్రగతిపై చర్చలో భాగంగా రైతు భరోసాపై చర్చిస్తారా? లేదా? అనేది తేలాల్సి ఉంది. కలెక్టర్లు రైతుల కష్టాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే రైతుభరోసాపై నిర్ణయం వెలువడుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.


