పల్లెకు పచ్చని హారం
మంథనిరూరల్: పల్లెల్లో పచ్చని వాతావరణం క ల్పించాలని, ప్రకృతికి పూర్వవైభవం తీసుకురావాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఏటా చేపట్టే వనమహోత్సవం కోసం పల్లెల్లో నర్సరీల ఏర్పాటుకు యంత్రాంగం శ్రీకారం చుట్టింది. ఆగస్టు, సెప్టెంబర్లో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహిస్తారు. ఇందుకోసం ఇప్పటినుంచే గ్రామాల్లో ఉపాధిహామీ పథకం ద్వారా మొక్కల పెంపకం చేపట్టారు.
34 గ్రామ పంచాయతీల్లో..
జిల్లాలోని మంథని మండలంలో 35 గ్రామ పంచాయతీలు ఉండగా సింగరేణి ప్రభావిత అక్కెపల్లి మినహా మిగతా అన్ని గ్రామ పంచాయతీల్లో నర్సరీ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఉపాధిహామీ కూలీలు ఇప్పటికే పాలిథిన్ కవర్లలో మట్టి నింపి మొక్కలు నాటారు.
2.12 లక్షల మొక్కల పెంపకం లక్ష్యంగా..
మంథని మండలంలోని 34 గ్రామ పంచాయతీల్లో ఏర్పాటు చేసిన నర్సరీల్లో 2,12,400 మొక్కల పెంపకం లక్ష్యంగా అధికారులు పనులు ప్రారంభించారు. ఇందులో వివిధ రకాల పూలు, పండ్ల మొక్కలు పెంచేలా విత్తనాలు నాటే పనులు పూర్తి చేశారు. పంచాయతీల విస్తీర్ణం ఆధారంగా మొక్కల పెంపకం చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
ఆగస్టు, సెప్టెంబర్లో..
వర్షాకాలం ప్రారంభమైన తర్వాత ప్రభుత్వం వన మహోత్సవం నిర్వహిస్తుంది. ఆగస్టు, సెప్టెంబర్ వరకు నర్సరీల్లో పెంచిన మొక్కలు నాటేందుకు సిద్ధమవుతారు. ఈరెండు నెలల్లో ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం ఆయా గ్రామాలు, ప్రాంతాల్లో మొక్కలు నాటనున్నారు.
లక్ష్యం నెరవేరేలా..
వనమహోత్సవంలో ప్రభుత్వ లక్ష్యం నెరవేరేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు. నిర్దేశించిన సమయానికి మొక్కలు పెరిగి నాటేందుకు సిద్ధమయ్యేలా చర్యలు చేపడుతున్నారు. ఉపాధిహామీ అధికారులు, మండల అధికారులు, పంచాయతీ కార్యదర్శులు నర్సరీలను క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేస్తూ అవసరమైన సలహాలు ఇస్తున్నారు.
పనులు ప్రారంభించాం
జిల్లాలోని అన్ని గ్రామాల్లో నర్సరీ పనులు ప్రారంభించారు. కొన్ని గ్రామాల్లో విత్తనాలు నాటే ప్రక్రియ పూర్తయ్యింది. వనమహోత్సవానికి మొక్కలు అందేలా అన్ని ఏర్పాట్లు పూర్తిచేశాం. మంథని మండలంలోని 34 గ్రామ పంచాయతీల్లో 2,12,800 మొక్కల పెంపకం లక్ష్యంగా పనులు జరుగుతున్నాయి.
– సదానందం, ఏపీవో, మంథని


