
కాంట్రాక్టు కార్మికులపై పట్టింపేది?
● ఈఎస్ఐ సేవలకు దూరం
● పట్టించుకోని యాజమాన్యం, కార్మిక సంఘాలు
గోదావరిఖని: సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ స్కీం ఆఫ్ ఇండియా(ఈఎస్ఐసీ) సౌకర్యం అందని ద్రాక్షే అవుతోంది. సంస్థలో సుమారు 35 వేల మంది కాంట్రాక్టు కార్మికులు ఉన్నారు. రామగుండం ప్రాంతంలోనే దాదా పు 10వేల మందికిపైగా పనిచేస్తున్నారు. వీరిలో కేవలం 600 మందికే ఈఎస్ఐ సౌకర్యం ఉంది. సింగరేణి యాజమాన్యం చొరవ చూపితేనే వీరు ఈఎస్ఐ సౌకర్యం పొందే వీలుంది. ఇలాంటి వారికే ఉచితంగా వైద్య సౌకర్యం అందుబాటులోకి వస్తాయి. ఏదైనా కారణంతో శాశ్వత అంగవైకల్యానికి గురైనా, మృతి చెందినా అనేక ప్రయోజనాలు వర్తిస్తాయి.
అనేక విభాగాల్లో..
సింగరేణిలోని స్వీపింగ్, హౌస్కీపింగ్, తోటమాలి, సివిల్, సివిక్, సేల్ పిక్కింగ్, బెల్ట్ క్లీనింగ్, షాంప్లింగ్, కన్వేయన్స్ వాహనాలు.. ఇలా పలు విభాగాల్లో కాంట్రాక్టు కార్మికులు పనిచేస్తున్నారు. ప్రతినెలా ఒక్కోకార్మికుడికి రూ.21 వేల వేతనం ఉంటుంది. అయినా, వీరిని ఈఎస్ఐ సౌకర్యం వరించడంలేదు.
ఈఎస్ఐసీ వ్యవీస్థీకృత రంగంలోని ఉద్యోగులకు సామాజిక, ఆర్థిక రక్షణ అందించే సామాజిక భద్రత పథకం. ఉద్యోగులకు అనారోగ్యం, ప్రసూతి, వైకల్యం, పని సమయంలో ప్రమాదాలతో ఏర్పడే గాయాలు, మృతి వంటివి సంభవిస్తే ఆర్థిక రక్షణ కల్పిస్తుంది. ఉద్యోగులతోపాటు వారి కుటుంబ సభ్యులకూ ఉచిత వైద్యం అందిస్తుంది.
వీరే అర్హులు..
పది లేదా అంతకన్నా ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్న సంస్థలు, కర్మాగారాలు, దుకాణాలు, కార్యాలయాల్లో ఆఫీసుల్లో పనిచేస్తూ నెలకు రూ.21 వేలు అంతకన్నా తక్కువ వేతనం ఉన్న వారు ఈఎస్ఐసీకి అర్హులు. ఇలాంటి వారిని ఈఎస్ఐసీ కింద నమోదు చేయడం సంస్థ యజమాని బాధ్యత. ఈపథకంలో చేరే ఉద్యోగి వేతనంలో 3.25శాతం యజమాని, 0.75శాతం ఉద్యోగి సమానమైన మొత్తాన్ని చందాగా జమచేస్తారు.
మెటర్నిటీ బెనిఫిట్:
● 26 వారాల పాటు మెటర్నీటీ బెనిఫిట్ లభిస్తుంది. వైద్యుడి సలహాపై మరో నెల పొడిగించుకోవచ్చు. పూర్తి వేతనం వస్తుంది.
తాత్కాలిక వైకల్యం:
● ఉద్యోగంలో ఉన్నప్పుడు గాయపడితే కాంట్రిబ్యూషన్తో సంబంధం లేకండా అంగవైకల్యం కొనసాగినంతకాలం వేతనంలో 90శాతం చెల్లిస్తారు.
శాశ్వత అంగవైక్యం:
మెడికల్ బోర్డు ధ్రువీకరణపై ప్రమాదంతో సంపాదన సామర్థ్యా ుఽన్ని కోల్పోయిన స్థాయిని బట్టి వేతనంలో 90శాతం ప్రయోజనం చెల్లిస్తారు.
డిపెండెంట్ బెనిఫిట్:
ఉద్యోగంలో గాయం లేదా వృత్తిపరంగా ప్రమాదంతో మరణం సంభవిస్తే ఉద్యోగిపై ఆధారపడిన వారికి జీతంలో 90శాతం డిపెండెంట్కి చెల్లిస్తారు.
ఇతర ప్రయోజనాలు:
● ఉద్యోగి మరణిస్తే ఖర్మల కోసం రూ.15వేలు చెల్లిస్తారు
● ఈఎస్ఐ ఉన్న మహిళ లేదా సభ్యుడి భార్య.. ఈఎస్ఐ కింద తగిన వైద్య సేవలు అందుబాటులో లేనిప్రదేశంలో ఉంటే కన్ఫైన్మెంట్ ప్రయోజనాన్ని అందజేస్తారు.
కమాన్పూర్ మండలం పిల్లిపల్లెకు చెందిన పిట్టల రమేశ్ సింగరేణి కాంట్రాక్టు కార్మికుడు. ఇటీవల ప్రమాదవశాత్తు చెట్టు పైనుంచిపడి మృతి చెందాడు. దీంతో మృతుడి భార్యకు కార్మిక రాజ్యబీమా(ఈఎస్ఐ) సంస్థ ద్వారా ప్రతినెలా రూ.7,400 పింఛన్ మంజూరవుతోంది.
కమాన్పూర్ ప్రాంతానికి చెందిన బండ అర్జయ్య సింగరేణి ఓసీపీ–1 జరిగిన పేలుడులో చనిపోయాడు. ఈఎస్ఐ సభ్యత్వం ఉండడంతో అతడి కుటుంబానికి ప్రతినెలా రూ.13,681 పింఛన్ వస్తోంది.
వైద్య ప్రయోజనాలు..
కుటుంబసభ్యులకు కార్పొరేట్స్థాయి వైద్యం
కాంట్రిబ్యూషన్తో సంబంధం లేకుండా అందరికీ ఒకేరకమైన వైద్యం
చికిత్సకు అయ్యే ఖర్చుపై గరిష్ట పరిమితి లేదు
రిటైర్డ్, శాశ్వత వికలాంగులు, జీవిత భాగస్వామ్యులకు టోకెన్ ప్రీమియం రూ.120 చెల్లింపుపై వైద్య సంరక్షణ వర్తిస్తుంది.
అనారోగ్య ప్రయోజనాలు..
ధ్రువీకరించిన కొన్ని వ్యాధులకు సిక్లీవ్ తీసుకోవచ్చు
ఏడాదిలో 91రోజుల పాటు ఈ సెలవులు తీసుకునే అవకాశం ఉంది
అనారోగ్యకాలంలో సిక్ బెనిఫిట్ కింద నగదురూపంలో పరిహారం ఇస్తారు
కార్మికుడి వేతనంలో 70శాతం చొప్పున పరిహారం ఉంటుంది
ఈ ప్రయోజనం కోసం ఆర్నెల్లలో కనీసం 78రోజులు కాంట్రిబ్యూట్ చేయాలి
రామగుండం ఈఎస్ఐ డిస్పెన్సనరీ
పరిధిలో కాంట్రాక్టు కార్మికులు
ఎన్టీపీసీ 9,600
రామగుండం బల్దియా 800
కేశోరాం 1,200
ఆర్ఎఫ్సీఎల్ 1,900
సింగరేణి 600