
మెడికల్ దందా
● ప్రిస్క్రిప్షన్ లేకుండానే విక్రయాలు ● ఫిజీషియన్ శాంపిళ్లు, కాలంచెల్లిన మందుల అమ్మకాలు ● షాపుల్లో బినామీల దందా.. కానరాని ఫార్మసిస్టు ● అధికారుల నామమాత్రపు తనిఖీలు
సాక్షి, పెద్దపల్లి: మీకు తల నిప్పి వస్తుందా? జ్వరం వస్తోందా? కడుపు, ఒళ్లు నొప్పులతో భరించలేన్నారా? నిద్ర పట్టడం లేదా? మీకు భయమేమీలేదు. అనారోగ్య సమస్యలపై డాక్టర్ను సంప్రదించాల్సిన అవసరమే లేదు. సమస్య గురించి చెబితే చాలు.. మెడికల్ షాపుల్లో అన్నిరకాల మందులూ ఇస్తారు. ఎంత మొత్తంలో కావాలన్నా విక్రయిస్తారు. ఏ మందు ఎ వేసుకోవాలో.. రోజుకు ఎన్ని వేసుకోవాలో.. ఎన్నిరోజులు వాడాలో కూడా వారే సూచిస్తారు. ఇలా జిల్లాలో మెడికల్ షాపుల నిర్వాహకులు అడ్డగోలు వ్యాపారం చేస్తున్నారు. అధికారులు ఏదోఓసారి తనిఖీ చేయడం, నామమాత్రంగా కేసులు నమోదు చేయడంతోనే చేతులు దులిపేసుకుంటున్నారు.
సేమ్ ఫార్ములా.. కంపెనీయే వేరు..
డ్రగ్స్, కాలపరిమితి దాటిన, నకిలీ మందుల విక్రయాలు సైతం జిల్లాలో జోరుగా సాగుతున్నాయి. డాక్టర్ రాసిన కంపెనీ ఔషధాలు లేకుంటే, వాటికి బదులు వేరే కంపెనీ మందులు అంటగడుతున్నారు. ఇదేమని ప్రశ్నిస్తే.. శ్రీసేమ్ ఫార్ములా.. కంపెనీ మాత్రమే వేరు.. ఇది కూడా దానిలాగే పనిచేస్తుంది.శ్రీ అని చెబుతున్నారు. జిల్లాలో సుమారు 800 వరకు రిటైల్, హోల్సేల్ మెడికల్ షాపులు ఉన్నాయి. రోజూ ప్రతీ చిన్న, పెద్ద దుకాణాల్లో రూ.5వేల నుంచి రూ.లక్ష వ్యాపారం సాగుతోంది. జిల్లాలోని డ్రగ్ ఇన్స్పెక్టర్ల అడ్రసే లేదు. వారు ఎక్కడ ఉంటారో? ఏ ప్రాంతంలో తనిఖీ చేస్తున్నారో ఎవరికీ తెలియదు.
లైసెన్స్ ఒకరిది.. నిర్వహణ మరొకరిది
డ్రగ్స్ అండ్ కాస్మొటిక్స్ యాక్టు–1940, ఫార్మసీ యాక్టు–1948 ప్రకారంగా బీ – ఫార్మసీ లేదా ఎం – ఫార్మసీ పూర్తిచేసిన వారే మెడికల్ షాపులు నిర్వహించాలి. షాపు పర్మిషన్ తీసుకునే సందర్భంలో సంబంధిత ఫార్మసిస్టుల సర్టిఫికెట్లతోపాటు వ్యక్తిగత గుర్తింపుకార్డు ప్రతులు, చిరునామా తదితర వివరాలు దరఖాస్తుతో జతచేసి డ్రగ్ ఇన్స్పెక్టర్కు సమర్పించాలి. అనుమతి మంజూరైన తర్వాతే షాపులు నిర్వహించాలి. జిల్లాలో మెడికల్ షాపులు చాలామంది బినామీలే నిర్వహిస్తున్నారు. ప్రొఫెషనల్ ఫార్మసిస్టు ఆధ్వర్యంలో అవగాహన ఉన్న సిబ్బందితోనే దుకాణాలను నిర్వహించాలి. చాలామంది తక్కువ వేతనంతో యువకులకు పనిలో పెట్టుకుంటున్నారు. మెడికల్పై పరిజ్ఞానం లేనివ్యక్తులు షాపులను నడుపుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.
రామగుండానికి చెందిన సింగరేణి కార్మికుడి కాలికి ఇటీవల గాయమైంది. బాధితుడు ఓ మెడికల్ షాపుకు వెళ్లి ఆయింట్మెంట్ కావాలని అడిగి తీసుకుని ఇంటికి వెళ్లాడు. అతడి కూమరుడు ఆయింట్మెంట్ను పరిశీలించి శాంపిల్గా గుర్తించిండు. ఇదేవిషయంపై మెడికల్ షాపు నిర్వాహకుడిని ప్రశ్నించగా.. దానికి చెల్లించిన డబ్బు తిరిగి ఇచ్చేశాడు.
పర్సంటేజీలు మాట్లాడుకొని..
జనరిక్, నాన్ జనరిక్ తేడా లేకుండా షాపుల నిర్వాహకులు ఔషధ కంపెనీలతో పర్సంటేజీలు మాట్లాడుకొని వైద్యులతో కుమ్మక్కై ప్రజలను నిలువుదోపిడీ చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. కొనుగోలు చేసిన మందులకు కనీసం బిల్లులు కూడా ఇవ్వకుండా విక్రయాలు చేస్తున్నారు. యాంటిబయాటిక్ మందులను డాక్టర్ల సూచనల మేరకు మాత్రమే ఇవ్వాలి. కానీ షాపుల నిర్వాహకులు ఇష్టారీతిన వ్యవహరిస్తూ యాంటిబయాటిక్ మందులను ఇస్తున్నట్లు సమాచారం. దీంతో అనవసరంగా యాంటిబయాటిక్ మందులు వాడిన వారు సైడ్ ఎఫెక్ట్లతో కొత్తరోగాల బారిన పడుతున్నారు. జిల్లాలో మెడికల్ దందాపై డ్రగ్ ఇన్స్పెక్టర్ వివరణ కోరగా జిల్లాలో తరచూ మెడికల్ షాపులను తనిఖీ చేస్తున్నామన్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహిరంచే షాపుల లెసెన్సులను రద్దు చేస్తామని ఆయన తెలిపారు.
కొన్ని సిర్ప్లలో మత్తు ప్రభావం కూడా ఉంటుంది. మాదక ద్రవ్యాలు వినియోగించే వారు ఈ సిరప్లు వాడుతున్నారు. డాక్టర్ చీటీపై రాసిస్తేనే వీటిని పేషెంట్కు విక్రయించాలి. మెడికల్ షాప్ నిర్వాహకులు ఇవేమీ పట్టించుకోవడంలేదు. నిషేధిత డ్రగ్స్, మత్తు కలిగించే సిరప్లనూ విచ్చలవిడిగా విక్రయిస్తున్నారు.

మెడికల్ దందా