
ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ ఇన్చార్జిగా అద్దంకి దయాకర్
కరీంనగర్ కార్పొరేషన్: ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జిగా ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ నియమితులయ్యారు. గ్రామస్థాయి నుంచి జిల్లా వరకు పార్టీని సంస్థాగతంగా పునర్నిర్మాణం చేయడంలో భాగంగా ఉమ్మడి జిల్లాలకు పార్టీ ఇన్చార్జిలను నియమిస్తూ పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ సోమవారం ఆదేశాలు జారీ చేశారు. జిల్లాకు చెందిన బీసీ సంక్షమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ను మెదక్ ఉమ్మడి జిల్లాకు, రాష్ట్రసంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ను వరంగల్ ఉమ్మడి జిల్లా పార్టీ ఇన్చార్జిగా నియమించారు.
జిల్లాకు వర్షసూచన
పెద్దపల్లిరూరల్: జిల్లాలో ఈనెల 9వ తేదీ వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కలెక్టర్ కోయ శ్రీహర్ష సోమవారం తెలిపారు. వాతావరణ శాఖ సూచనల మేరకు బంగాళా ఖాతంలో వాయుగుండం ఏర్పడిందని, దీంతో జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఎలాంటి ప్ర మాదాలు జరగకుండా ముందస్తు చర్యలతో సిద్ధంగా ఉండాలని ఆయన సూచించారు.
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
రామగిరి: సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పంచాయతీల్లో ఎప్పటికప్పడు శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని జెడ్పీ సీఈవో నరేందర్ ఆదేశించారు. సోమవారం ఎంపీడీవో కార్యాలయాన్ని తనిఖీ చేశారు. ఎంపీడీవో శైలజారాణి మండలంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, తదితర అంశాల గురించి వివరించారు. రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కు సన్నద్ధంగా ఉండాలని జెడ్పీసీఈవో పేర్కొన్నారు. సీనియర్ అసిస్టెంట్ రామకృష్ణ, జూని యర్ అసిస్టెంట్ కవిత, సిబ్బంది పాల్గొన్నారు.
వర్గపోరుకు ‘గుజ్జుల’ తీరే కారణం
పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి నియోజకవర్గానికి పాతికేళ్ల కాలం క్రితం వలస వచ్చిన గుజ్జుల రామకృష్ణారెడ్డిని కేవలం 12 రోజుల స్వల్ప కాలంలోనే పెద్దపల్లి ప్రజలు అక్కున చేర్చుకొని ఎమ్మెల్యేగిరి అప్పగిస్తే.. రూ.వందల కోట్ల ఆస్తులు కూడబెట్టుకొని పార్టీని ఇతర పార్టీలకు తాకట్టు పెట్టి లబ్ధి పొందుతున్నాడని బీజేపీ నాయకులు చిలారపు పర్వతాలు, కావేటి రాజగోపాల్, ఈర్ల శంకర్, సంపత్రావు ఆరోపించారు. పెద్దపల్లిలో సోమవారం మాట్లాడారు. పట్టణ అధ్యక్షుడు పెంజర్ల రాకేశ్, మండల అధ్యక్షుడు వేల్పుల రమేశ్ పార్టీ అధిష్టానం అనుమతితో కమిటీలను ప్రకటిస్తే.. జిల్లా అధ్యక్షుడు సంజీవరెడ్డి, మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి తమ వారితో అర్థరహిత, నిరాధార ఆరోపణలు చేసి కార్యకర్తలు, నాయకుల్లో అయోమయం సృష్టించేందుకు యత్నించడమేమిటని మండిపడ్డారు. ఇపుడు జిల్లా అధ్యక్షుడిగా ఉన్న కర్రె సంజీవరెడ్డికి కనీసం సభ్యత్వం కూడా లేదన్నారు. నాయకులు తంగెడ రాజేశ్వర్రావు, మేకల శ్రీనివాస్, చిలువేరు సంపత్, కారంగుల శ్రీనివాస్ తదతరులున్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతులు
పెద్దపల్లిరూరల్: ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందిస్తూ విద్యార్థులకు మౌలిక వసతులను కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, పిల్లలను సర్కారు బడులకే పంపించాలని మహిళా కమిషన్ స భ్యురాలు కఠారి రేవతిరావు అన్నారు. కొత్తపల్లి ప్రభుత్వ, ఉన్నత పాఠశాలను సోమవారం సందర్శించి వసతులపై ఆరా తీశారు. మధ్యాహ్న భోజనం వంటలను పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన, రుచికరమైన భోజనాన్ని అందించాలని సూచించారు. గ్రామంలోని ఎస్సీకాలనీ, తెనుగువాడ నుంచి విద్యార్థులు పాఠశాలకు రావడం ఇబ్బందిగా మారిందని పేరెంట్స్ కమిటీ చైర్పర్సన్ సబ్బు రాజకుమారి తదితరులు రేవతిరావు దృష్టికి తెచ్చారు. రైల్వే గేటు మూసివేతతో కష్టాలు పెరిగాయని, అండర్ బ్రిడ్జి ద్వారా వచ్చేందుకు దూరం పెరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. హెచ్ఎం, ఉపాధ్యాయులు తదితరులున్నారు.

ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ ఇన్చార్జిగా అద్దంకి దయాకర్

ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ ఇన్చార్జిగా అద్దంకి దయాకర్