
టెండర్లకే పరిమితం
● జెడ్పీ కార్యాలయం భవన నిర్మాణానికి నిధులు మంజూరు ● ఇంకా ప్రారంభం కాని పనులు ● ప్రత్యేకాధికారికి చాంబర్ కరువు ● రిటైర్డ్ ఉద్యోగుల సంఘ భవనంలో నిర్వహణ ● కొత్త పాలకమండలి వస్తే సమావేశాలెక్కడో..?
పెద్దపల్లిరూరల్: జిల్లా పరిషత్ కార్యాలయ భవనాన్ని తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో నిర్మించేందుకు నిధులు మంజూరైనా.. ఇంకా పనులు మొదలు కావడంలేదు.. తాత్కాలికంగా తహసీల్దార్ ఆఫీసు ఆవరణలోని రిటైర్డ్ ఉద్యోగుల భవనంలో ఇరుకై న గదుల్లో సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. జెడ్పీ పాలకమండలి పదవిలో కొనసాగినంత కాలం చైర్మన్ చాంబర్ కోసం కేటాయించిన భవనాన్ని, పదవీకాలం ముగియడంతో తహసీల్దార్ ఆఫీసుకు కేటాయించారు. దీంతో ప్రత్యేకాధికారిగా వ్యవహరిస్తున్న కలెక్టర్ ఎప్పుడైనా కార్యాలయానికి వస్తే కూర్చోలేని పరిస్థితి నెలకొంది.
ఎంపీడీవో ఆఫీసును కూల్చి కట్టాలనుకుంటే..
పెద్దపల్లి పట్టణంలోని బస్టాండ్ను ఆనుకుని ఉన్న ఎంపీడీవో ఆఫీసు భవనాన్ని కూల్చి ఆ స్థానంలో జిల్లా పరిషత్ కార్యాలయ భవనంతో పాటు, మండల కార్యాలయాల సముదాయాన్ని నిర్మించాలని అప్పటి ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి, జెడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ ప్రతిపాదించినా అవి కార్యరూపం దాల్చలేదు. ఇటీవల ఎంపీడీవో ఆఫీసు భవనాన్ని ఆర్టీసీ బస్డిపో ఏర్పాటుకు కేటాయించారు. దీంతో ఎంపీడీవో కార్యాలయమే ప్రస్తుతం అద్దె భవనంలోకి మారాల్సి వచ్చింది. ఈ క్రమంలో తహసీల్దార్ ఆఫీసు ఆవరణలోని ఖాళీ స్థలంలోనే జెడ్పీ కార్యాలయాన్ని నిర్మించేలా చర్యలు చేపట్టారు. నిధులు మంజూరై టెండర్లు పూర్తయినా ఇంకా పనులు ప్రారంభం కాలేదు. వీలైనంత త్వరగా పనులు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.
ప్రత్యేకాధికారిగా వచ్చినా..
జిల్లా పరిషత్ కార్యాలయానికి ప్రత్యేకాధికారిగా కలెక్టర్ వ్యవహరిస్తున్నారు. రాష్ట్రావతరణ, రిపబ్లిక్, స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సమయంలో కార్యాలయానికి వచ్చినా.. బయటే జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వెనుదిరగాల్సిన పరిస్థితులున్నాయి. కార్యాలయంలో కూర్చునేందుకు చాంబర్ ఏర్పాటుకు అనువుగా లేకపోవడమే కారణం. కార్యాలయ సిబ్బందే ఇరుకై న గదుల్లో విధులు నిర్వర్తించాల్సి వస్తోంది.
నిధులు మంజూరయ్యాయి
జిల్లా పరిషత్ కార్యాలయ భవన నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. తహసీల్దార్ ఆఫీసు ఆవరణలోనే నిర్మించనున్నారు. పంచాయతీరాజ్, ఇంజనీరింగ్ అధికారుల పర్యవేక్షణలో పనులు మొదలు కావాల్సి ఉంది.
– నరేందర్, జెడ్పీ సీఈవో

టెండర్లకే పరిమితం