హస్తం హవా | - | Sakshi
Sakshi News home page

హస్తం హవా

Dec 4 2023 1:48 AM | Updated on Dec 4 2023 1:48 AM

సెంటినరీకాలనీ జేఎన్టీయూ కౌంటింగ్‌ కేంద్రంలో ఓట్లు లెక్కిస్తున్న అధికారులు, సిబ్బంది - Sakshi

సెంటినరీకాలనీ జేఎన్టీయూ కౌంటింగ్‌ కేంద్రంలో ఓట్లు లెక్కిస్తున్న అధికారులు, సిబ్బంది

ఉమ్మడి జిల్లాలో ఫలితాలు ఇలా..

సాక్షిప్రతినిధి, కరీంనగర్‌: ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా అసెంబ్లీ ఫలితాలు కాంగ్రెస్‌ పార్టీకి ఊపిరిపోశాయి. గత 20 ఏళ్లలో ఏనాడూ చూడని స్పష్టమైన సీట్లు రావడం గమనార్హం. 2004లో వైఎస్‌.రాజశేఖరరెడ్డి హయాంలో టీఆర్‌ఎస్‌–సీపీఐ పొత్తులతో కాంగ్రెస్‌ కూటమి 10 సీట్లు(కాంగ్రెస్‌ 5, టీఆర్‌ఎస్‌ 4, సీపీఐ 1) సాధించింది. ఇప్పుడు 8 స్థానాల్లో విజయకేత నం ఎగరేసి కాంగ్రెస్‌–సీపీఐ కూటమి సత్తాచాటుకుంది. ప్రధానంగా పెద్దపల్లి జిల్లాలో పెద్దపల్లి, రా మగుండం, మంథని నియోజకవర్గాలను కైవసం చేసుకుని క్లీన్‌స్వీప్‌ చేసింది. ఇక పొరుగునే ఉన్న ధ ర్మపురితోపాటు వేములవాడ, చొప్పదండి, మానకొండూరు, హుస్నాబాద్‌నూ కాంగ్రెస్‌ తన ఖాతా లో వేసుకుంది. 2018 ఎన్నికల్లో 12 స్థానాలు గెలి చిన బీఆర్‌ఎస్‌ ఈ ఎన్నికల్లో సిరిసిల్ల, జగిత్యాల, కోరుట్ల, కరీంనగర్‌, హుజూరాబాద్‌తో కలిపి ఐదో స్థానాలకు పరిమితమైంది. ఇక హుజూరాబాద్‌, క రీంనగర్‌, కోరుట్లలో బీజేపీ పెట్టుకున్న ఆశలు గల్లంతయ్యాయి.

బండి.. గంగుల నువ్వా–నేనా..

కరీంనగర్‌లో విజయం చివరి వరకు దోబూచులా డింది. చివరి రౌండ్‌ వరకు సాగిన ఉత్కంఠ పోరులో తొలుత స్వల్ప ఓట్లతో గంగుల కమలాకర్‌ విజ యం సాధించారు. దీనిపై బండి సంజయ్‌ అభ్యంతరం తెలుపుతూ కౌంటింగ్‌ కేంద్రం వద్దకొచ్చారు. పోలింగ్‌ బూత్‌ 43, 289లో ఓట్ల లెక్కింపు చేపట్టలేదని ఆరోపించారు. సంజయ్‌ వినతిని పరిగణనలో కి తీసుకున్న రేకుర్తిలోని లయోల బీఈడీ కాలేజీ రూ మ్‌నంబర్‌ 3లోని 594 ఓట్లు, రాంపూర్‌లోని విద్యార్థి హైస్కూల్‌లోని పోలింగ్‌ కేంద్రాల్లోని 697 ఓట్లు లెక్కించారు. చివరకు 3,163 ఓట్ల మెజారిటీతో గంగుల గెలవడంతో ఉత్కంఠకు తెరపడింది.

● ఇక కాంగ్రెస్‌ అభ్యర్థులు మానకొండూరు– కవ్వంపల్లి సత్యనారాయణ విజయం సాధించారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌పై ఏ దశలోనూ వెనకబడలేదు.

● చొప్పదండి– మేడిపల్లి సత్యం కూడా ప్రతీ రౌండ్‌లోనూ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌పై ఆధిపత్యం చూపించారు.

● హుజూరాబాద్‌లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి– పాడి కౌశి క్‌రెడ్డి తమ ప్రత్యర్థులపై ఆది నుంచి సిట్టింగ్‌ ఎ మ్మెల్యే ఈటల రాజేందర్‌, కాంగ్రెస్‌ అభ్యర్థి ఒడితల ప్రణవ్‌పై స్పష్టమైన ఆధిక్యంతో గెలిచారు.

● పెద్దపల్లి జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీ మంథని– శ్రీధర్‌బాబు, రామగుండం– మక్కాన్‌ సింగ్‌, పెద్దపల్లి– విజయరమణారావు నియోజకవర్గాల్లో విజయం సాధించడంతో క్లీన్‌స్వీప్‌ చేసింది. ఇందులో ఠాకూర్‌ మక్కాన్‌సింగ్‌ మూడోసారి పోటీ చేయడం, రామగుండంలో కాంగ్రెస్‌కు వచ్చిన అనూహ్య ఆదరణ, స్థానికంగా సానుభూతి పనిచేశాయి.

● సిరిసిల్లలో కేటీఆర్‌(బీఆర్‌ఎస్‌) సునాయస విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. తన చిరకాల ప్రత్యర్థి కేకే మహేందర్‌రెడ్డిని ఐదో సారి ఓడించారు. 2009 నుంచి వీరిద్దరూ పోటీ పడటం ఐదోసారి కావడం విశేషం. కాంగ్రెస్‌ హవా, సానుభూతి పనిచేయలేదు.

● వేములవాడలో ఊహించినట్లుగానే ఆది శ్రీనివాస్‌(కాంగ్రెస్‌) విజయం సాధించారు. ఆయన అసెంబ్లీకి పోటీ పడటం వరుసగా ఐదోసారి. గతంలో సిట్టింగ్‌ ఎమ్మెల్యే రమేశ్‌బాబు పౌరసత్వం విషయంలో న్యాయపరంగా పోరాడినా ఫలించలేదు. ఎట్టకేలకు ప్రజల దీవెనలతో ఎమ్మెల్యేగా గెలుపొందారు. వేములవాడ ఆలయ చైర్మన్‌గా పనిచేసిన వారు ఎమ్మెల్యేలుగా గెలవరంటూ దశాబ్దాలుగా సాగుతున్న సంప్రదాయానికి తెరదించారు. సమీప బీఆర్‌ఎస్‌ అభ్యర్థి చెలిమెడ లక్ష్మీనరసింహారావు, బీజేపీ అభ్యర్థి వికాస్‌రావులపై స్పష్టమైన మెజారిటీ సాధించారు.

● జగిత్యాలలో తొలుత జీవన్‌రెడ్డి పది రౌండ్ల వరకు ఆధిపత్యం కనిపించినా.. తర్వాత పుంజుకున్న సంజయ్‌ విజయం సాధించారు. కోరుట్లలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి డాక్టర్‌ కె.సంజయ్‌ అనూహ్యంగా గెలిచారు. సమీప ప్రత్యర్థి ఎంపీ ధర్మపురి అర్వింద్‌ను ఢీకొట్టగలరా? అన్న ప్రచారం జరిగింది. ఎగ్జిట్‌పోల్స్‌ కూడా అర్వింద్‌కే మొగ్గుచూపాయి. సిట్టింగ్‌ ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావుకు ఉన్న పేరు, అనుభవం సంజయ్‌ గెలుపులో కీలకపాత్ర పోషించాయి. ధర్మపురిలో కాంగ్రెస్‌ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ తన చిరకాల ప్రత్యర్థి మంత్రి కొప్పుల ఈశ్వర్‌పై విజయం సాధించారు. 2009 నుంచి వీరిద్దరూ తలపడటం ఇది ఐదోసారి కావడం గమనార్హం. కాంగ్రెస్‌ హవా, లక్ష్మణ్‌పై సానుభూతి, అధికార పార్టీపై వ్యతిరేకత కలిసివచ్చాయి.

విశేషాలు..

● కరీంనగర్‌ నుంచి ఎంపీ బండి సంజయ్‌, కోరుట్ల నుంచి ఎంపీ అరింద్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల చేతిలో పరాజయం పాలయ్యారు. వీరిద్దరూ బీజేపీ అగ్రనేతలుగా వెలుగొంది, పార్టీ ఆదేశాలతో అసెంబ్లీ బరిలో దిగారు.

● హుజూరాబాద్‌ నుంచి పోటీచేసిన ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌ రెడ్డి విజయం సాధించగా, జగిత్యాల నుంచి పోటీ చేసిన ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఓడిపోయారు.

● రాష్ట్రంలో వరుసగా ఏడుసార్లు గెలిచి సరికొత్త రికార్డు సృష్టించిన మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ ఎనిమిదోసారి పోటీలో ఓడారు. ఈసారి గెలిస్తే అత్యధికసార్లు శాసనసభకు ఎన్నికై న ఎమ్మెల్యేగా మరో కొత్త రికార్డు సృష్టించేవారు. ఆయన పోటీచేసిన హుజూరాబాద్‌, గజ్వేల్‌లో రెండుచోట్ల ఓటమి పాలయ్యారు.

● ఇప్పటి వరకు ఆరుసార్లు ఎమ్మెల్యేగా, ఐదుసార్లు గెలిచిన మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ఆరో దఫా పోటీలో తొలిసారి ఓడిపోయారు. ఈయన గెలిచి ఉంటే ఈటల రాజేందర్‌ ఏడుసార్లు ఎమ్మెల్యే రికార్డు సమం అయ్యేది.

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో 8 కాంగ్రెస్‌ .. 5 బీఆర్‌ఎస్‌ కైవసం

ఉమ్మడి జిల్లాలో 8 స్థానాలు కాంగ్రెస్‌ కై వసం

2004 ఫలితాలు పునరావృతం

5 స్థానాలకే బీఆర్‌ఎస్‌ పరిమితం

జగిత్యాలలో తీవ్ర పోటీ ఇచ్చిన జీవన్‌రెడ్డి

ఎంపీలు అర్వింద్‌, సంజయ్‌కు పరాజయం

19 ఏళ్లలో తొలిసారి ఓడిన ఈటల

రికార్డులు కోల్పోయిన కొప్పుల, రాజేందర్‌

కరీంనగర్‌: గంగుల కమలాకర్‌ (బీఆర్‌ఎస్‌), ఓట్లు: 92,179, మెజారిటీ 3,163, రెండోస్థానం: బండి సంజయ్‌ కుమార్‌ (బీజేపీ), ఓట్లు: 89,016, మూడో స్థానం: పురమల్ల శ్రీనివాస్‌ (కాంగ్రెస్‌) ఓట్లు: 40,057

పెద్దపల్లి: విజయరమణరావు (కాంగ్రెస్‌), ఓట్లు: 1,18,888, మెజారిటీ: 55,108, రెండో స్థానం: దాసరి మనోహర్‌రెడ్డి(బీఆర్‌ఎస్‌) ఓట్లు: 63,780, మూడో స్థానం: దాసరి ఉష(బీఎస్పీ), ఓట్లు 10,315.

రామగుండం: రాజ్‌ఠాకూర్‌ మక్కాన్‌సింగ్‌ (కాంగ్రెస్‌), ఓట్లు: 92,227, మెజారిటీ: 56,794, రెండో స్థానం: కోరుకంటి చందర్‌(బీఆర్‌ఎస్‌), ఓట్లు: 35,433, మూడో స్థానం: కందుల సంధ్యారాణి(బీజేపీ), ఓట్లు: 12,966

మంథని: దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు (కాంగ్రెస్‌), ఓట్లు: 1,03,822 మెజారిటీ: 31,380, రెండో స్థానం: పుట్ట మధు (బీఆర్‌ఎస్‌), ఓట్లు: 72,442, మూడో స్థానం: సునీల్‌ రెడ్డి (బీజేపీ), ఓట్లు: 5,779

మానకొండూరు: సత్యనారాయణ (కాంగ్రెస్‌ ) పొందిన ఓట్లు: 96,773 మెజారిటీ : 32,365, రెండో స్థానం: రసమయి బాలకిషన్‌ (బీఆర్‌ఎస్‌), ఓట్లు: 64,408, మూడో స్థానం : ఆరెపల్లి మోహన్‌ (బీజేపీ) ఓట్లు: 14,879

చొప్పదండి: మేడిపల్లి సత్యం, పార్టీ: కాంగ్రెస్‌ ఓట్లు : 90,395, మెజారిటీ: 37,439, రెండో స్థానం: సుంకే రవిశంకర్‌ పార్టీ: (బీఆర్‌ఎస్‌) ఓట్లు : 52,956, మూడో స్థానం : బొడిగె శోభ గాలన్న, (బీజేపీ) ఓట్లు : 26,669

హుజూరాబాద్‌: పాడి కౌశిక్‌ రెడ్డి (బీఆర్‌ఎస్‌) ఓట్లు : 80,333 , మెజార్టీ: 16,873, రెండో స్థానం: ఈటల రాజేందర్‌ (బీజేపీ), ఓట్లు : 63,460, మూడో స్థానం : ఒడితల ప్రణవ్‌ (కాంగ్రెస్‌) ఓట్లు :53,164

హుస్నాబాద్‌: పొన్నం ప్రభాకర్‌ (కాంగ్రెస్‌), ఓట్లు: 1,00,955 , మెజార్టీ:19,344, రెండో స్థానం: ఒడితల సతీశ్‌ కుమార్‌, ఓట్లు: 81,611, మూడో స్థానం: బొమ్మ శ్రీరామ్‌ చక్రవర్తి, ఓట్లు: 8338

సిరిసిల్ల: తారక రామారావు, (బీఆర్‌ఎస్‌), ఓట్లు: 89,244, మెజారిటీ: 29,687, రెండో స్థానం: కేకే మహేందర్‌ రెడ్డి (కాంగ్రెస్‌), ఓట్లు: 59,557, మూడో స్థానం: రాణిరుద్రమారెడ్డి(బీజేపీ) 18, 328

వేములవాడ: ఆది శ్రీనివాస్‌ (కాంగ్రెస్‌) ఓట్లు: 71451.మెజారిటీ: 14,581, రెండో స్థానం: చెలిమెడ లక్ష్మీనర్సింహారావు (బీఆర్‌ఎస్‌). ఓట్లు: 56,870, మూడో స్థానం: చెన్నమనేని వికాస్‌రావు (బీజేపీ), ఓట్లు: 29,710.

జగిత్యాల: సంజయ్‌కుమార్‌ (బీఆర్‌ఎస్‌), ఓట్లు: 70,243, మెజారిటీ: 15822, రెండోస్థానం : టి.జీవన్‌రెడ్డి (కాంగ్రెస్‌), ఓట్లు : 54,421, మూడోస్థానం : బోగ శ్రావణి (బీజేపీ), ఓట్లు : 42,138

కోరుట్ల: సంజయ్‌ (బీఆర్‌ఎస్‌), ఓట్లు : 72,115, మెజారిటీ: 10,305, రెండోస్థానం: ధర్మపురి అర్వింద్‌ (బీజేపీ), ఓట్లు : 61,810, మూడో స్థానం : జువ్వాడి నర్సింగారావు (కాంగ్రెస్‌), ఓట్లు : 39,647

ధర్మపురి: అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ (కాంగ్రెస్‌), ఓట్లు: 91,393, మెజారిటీ: 22,039, రెండోస్థానం: కొప్పుల ఈశ్వర్‌ (బీఆర్‌ఎస్‌), ఓట్లు: 69,354, మూడో స్థానం : ఎస్‌.కుమార్‌ (బీజేపీ), ఓట్లు: 7,345

జేఎన్టీయూలో పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపు1
1/5

జేఎన్టీయూలో పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపు

ఈవీఎం తెరుస్తున్న అధికారులు2
2/5

ఈవీఎం తెరుస్తున్న అధికారులు

బందోబస్తు పర్యవేక్షిస్తున్న డీసీపీ చేతన3
3/5

బందోబస్తు పర్యవేక్షిస్తున్న డీసీపీ చేతన

ఈవీఎంలతో వెళ్తున్న సిబ్బంది4
4/5

ఈవీఎంలతో వెళ్తున్న సిబ్బంది

ధ్రువీకరణ పత్రం అందుకుంటున్న విజయరమణారావు అనుచరుడు5
5/5

ధ్రువీకరణ పత్రం అందుకుంటున్న విజయరమణారావు అనుచరుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement