● నేటి నుంచి వైఎస్సార్ సీపీ నిరసనలు
సాక్షి, పార్వతీపురం మన్యం: ఎన్నికలకు ముందు కూటమిగా జత కట్టారు. లెక్కలేనన్ని హామీలు గుప్పించారు. నమ్మి ఓటేసిన ప్రజలకు.. గెలిచిన తర్వాత ముఖం చాటేశారు. ఇదీ.. రాష్ట్రంలో కూటమి సర్కారు తీరు. చంద్రబాబు ప్రభుత్వ వెన్నుపోటుకు రెండేళ్లు అయిన నేపథ్యంలో.. ఇచ్చిన హామీలను అమలు చేయలేకపోయిన ప్రభుత్వ తీరును ఎండగడుతూ వైఎస్సార్సీపీ మరో ప్రజా పోరాటానికి సిద్ధమయ్యింది. పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ పేరిట నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకు శ్రేణులు సిద్ధమయ్యాయి. గురువారం నుంచి ఈ నెల 12వ తేదీ వరకు వివిధ రూపాల్లో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఈ నెల 4న అన్ని మండల కేంద్రాల్లో.. టీడీపీ ఎన్నికల మేనిఫెస్టో, పత్రికల్లో ఎన్నికల ముందు ప్రచురించిన మేనిఫెస్టో ప్రకటనలు.. చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఫొటోలతో సంతకాలు చేసిన బాండ్లను మంటల్లో వేసి తగలబెట్టనున్నారు. ఈ నెల 8, 9వ తేదీల్లో నియోజకవర్గ కేంద్రంలో టౌన్ హాల్స్ సదస్సు నిర్వహించనున్నారు. యువకులు, రైతులు, మహిళల సమక్షంలో ‘చంద్ర బాబు వెన్నుపోటుకు రెండేళ్లు’ పుస్తకం చూపిస్తూ అందులో ఉన్న అంశాలపై చర్చించనున్నారు. ఈ నెల 12న అన్ని నియోజకవర్గాల కేంద్రాల్లో పెద్ద ఎత్తున ర్యాలీలు చేపట్టనున్నారు. ఈ కార్యక్రమాల్లో ప్రజలను పెద్ద ఎత్తున భాగస్వామ్యం చేస్తూ, చంద్రబాబు ప్రభుత్వ రెండేళ్ల నయవంచన పాలనను ఎండగట్టేందుకు వైఎస్సార్సీపీ నాయకులు సిద్ధమవుతున్నారు.


