పార్వతీపురం రూరల్: విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టుపై జరిగిన భౌతిక దాడిని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ (ఏపీయూడబ్ల్యూజే) తీవ్రంగా ఖండించింది. ఇది ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టని పేర్కొంది. నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని ఎస్పీ కార్యాలయంలో ఏఎస్పీ వెంకటేశ్వరరావుకు యూనియన్ నాయకులు వినతిపత్రం అందజేశారు. పోలీస్ స్టేషన్ సాక్షిగా ఇంతటి దుస్సాహసానికి ఒడిగట్టారంటే జిల్లాలో విలేకరుల రక్షణ ప్రశ్నార్థకంగా మారిందని ధ్వజమెత్తారు. ముందస్తు పథకం ప్రకారమే ఈ దాడి జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. నిందితులను అరెస్ట్ చేయడంలో జాప్యం జరిగితే జిల్లావ్యాప్తంగా ధర్నాలు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే నాయకులు గంగి శ్రీనివాసరావు, ఆర్.సుధాకర్, గోపాల్, దుర్గా, అనంతరావు, సాక్షి స్టాఫర్ రామకృష్ణ, నవీన్, దివానీ, సోమశేఖర్, కాకిముక్కల నాగు, శేఖర్, శాస్త్రి, శంకరరావు, నాయుడు, కృష్ణ, సుధీర్, తదితరులు పాల్గొన్నారు.


