పాలకొండ రూరల్: ఎట్టకేలకు వరుణుడు కరుణించడంతో పాలకొండ, పరిసర ప్రాంత ప్రజలు ఊరట చెందారు. కొద్ది రోజులుగా తీవ్ర ఎండల ధాటికి ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలకు బుధవారం రాత్రి కురిసిన ఓ మోస్తరు వర్షం ఆహ్లాదాన్ని, చల్లదనాన్ని అందించింది. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు ఊపిరి పీల్చుకున్నారు. పగటి పూట ఉదయం 9 గంటల నుంచి ఎండలు తీవ్రరూపం దాల్చుతుండడంతో ఇళ్లకు పరిమితమైన స్థానికులు తాజా వర్షంతో వేడి నుంచి కొంతమేర ఉపశమనం పొందారు. మరోవైపు వేసవి దుక్కులు చేపడుతున్న తమకు ఈ వర్షం మేలు చేకూర్చనుందని రైతులు పేర్కొంటున్నారు.


