బొండపల్లి: మండల కేంద్రం బొండపల్లిలో కొద్ది రోజులుగా చెరువులో గ్రావెల్ను అభివృద్ధి పనుల ముసుగులో అక్రమంగా తరలించుకుపోతున్నారు. గ్రామాన్ని ఆనుకుని ఉన్న కొత్త చెరువులో రెవెన్యూ అధికారుల అనుమతులు లేకుండానే వందలాది ట్రాక్టర్ల గ్రావెల్ను రాత్రి పూట యథేచ్ఛగా తరలిస్తున్నారు. గ్రావెల్ను ఇళ్ల నిర్మాణంలో ఖాళీ స్థలాలను ఎత్తు చేసుకునేందుకు, పశువుల శాలలు ఖాళీ స్థలాలను ఎత్తు చేసేందుకు అక్రమంగా తరలించుకుపోతున్నారు. ఈ విషయం రెవెన్యూ అధికారులకు తెలిసినా చూసీచూడనట్లు వదిలేయడంతో వారి అక్రమాలకు అంతు లేకుండా పోతోంది. చెరువుల్లో గ్రావెల్ తవ్వాలంటే రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు, మైన్స్ అధికారుల అనుమతులు తీసుకున్న తర్వాత వారు సూచించిన మోత్తాన్ని ప్రభుత్వానికి జమ చేసి తరలించాల్సి ఉంది. మరో వైపు వాల్టా చట్టం నిబంధనలకు లోబడి తరలించాలి. ఈ నిబంధనలు అన్ని గాలికి వదిలేసి ప్రభుత్వ రోడ్డు పనులు, అభివృద్ధి పనుల పేరుతో గ్రావెల్ను తరలిస్తూ పక్కదారి పట్టిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. గ్రావెల్ అక్రమ తవ్వకాలపై ఇటీవల బొండపల్లిలో జరిగిన గ్రామ సభలో పలువురు ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు అధికారుల ముందు బాహాటంగానే నిలదీసినప్పటికీ చర్యలు మాత్రం శూన్యం.
అభివృద్ధి పనుల ముసుగులో తరలింపు


