విజయనగరం ఫోర్ట్: మొక్కలు నాటేందుకు అవసరమైన భూములను సిద్ధం చేయాలని కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి అన్నారు. శనివారం స్థానిక కలెక్టరేట్ నుంచి ఉద్యాన, వ్యవసాయాధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడుతూ.. మిషన్ హార్టివిజన్ కార్యక్రమంలో భాగంగా రెండో విడతలో 7,260 ఎకరాల్లో మొక్కలు నాటేందుకు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కూరగాయలు, ఆకుకూరలు, డ్రాగన్ ఫ్రూట్, తదితర ఉద్యాన పంటలతో పాటు అంతర పంటలను సాగు చేయడమే ప్రధాన లక్ష్యంగా నిర్ణయించడం జరిగిందన్నారు. 7,260 ఎకరాల్లో ఉద్యాన సాగు లక్ష్యం కాగా.. ప్రస్తుతానికి 2,714 మంది రైతులకు చెందిన 6,037 ఎకరాల భూమిని గుర్తించినట్లు చెప్పారు. మిగిలిన భూమిని కూడా గుర్తించి సిద్ధం చేయాలన్నారు. ఇప్పటివరకు 275 బ్లాక్లు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ప్రతి బ్లాక్లో కనీసం ఐదు ఎకరాలకు తక్కువ లేకుండా భూమి ఉండాలన్నారు. కాన్ఫరెన్స్లో జిల్లా ఉద్యానశాఖ అధికారి చిట్టిబాబు, జిల్లా వ్యవసాయ అధికారి వీటీ రామారావు, డీఆర్డీఏ పీడీ శ్రీనివాస పాణి, తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ రాంసుందర్ రెడ్డి


