గంజాయి కేసులో నిందితుడికి రిమాండ్
విజయనగరం క్రైమ్: గంజాయి రవాణా కేసులో అల్లంగి భగవాన్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశామని విజయనగరం రూరల్ సీఐ లక్ష్మణరావు తెలిపారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఏఓబీ పరిధిలోని ముంచంగిపుట్టు మండలం బుంగపుట్టుకి చెందిన అల్లంగి భగవాన్ను మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా 14 రోజులు రిమాండ్ విధించారన్నారు. కొద్ది రోజుల కిందట భగవాన్ మరో ఐదుగురితో కలిసి విజయనగరానికి ఆటోల గంజాయి తరలిస్తుండగా పట్టుకున్నట్లు చెప్పారు. అయితే ఆ సమయంలో భగవాన్ తప్పించుకోగా.. గంట్యాడ మండలం కొటారుబిల్లి జంక్షన్ వద్ద ఆదివారం అరెస్ట్ చేసి న్యాయమూర్తి ముందు హాజరపరిచామని చెప్పారు. మిగిలిన నలుగురు నిందితులను అప్పుడే అరెస్ట్ చేశామని తెలిపారు.
కొత్తవలస: గంజాయి కేసుల్లో పట్టుబడిన నిందుతులపై హిస్టరీ షీట్లు తెరవడంతో పాటు అక్రమంగా సంపాదించిన ఆస్తులను జప్తు చేయాలని ఎస్పీ ఏఆర్ దామోదర్ అన్నారు. మండల కేంద్రంలోని పోలీస్స్టేషన్ను ఆదివారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వివిధ సమయాల్లో పట్టుబడిన గంజాయి కేసులపై సమీక్షించారు. పరారీలో ఉన్న నిందితులను అరెస్ట్ చేసి సకాలంలో కోర్టులో అభియోగ పత్రాలను దాఖలు చేయాలని సూచించారు. వివిధ కేసుల్లో, రోడ్డు ప్రమాదాల్లో పట్టుబడిన వాహనాలను నిబంధనల మేరకు విడుదల చేయాలన్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. గంజాయి రవాణాను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక చెక్పోస్టులు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఎస్.కోట మండల సమీపంలోని బొడ్డవర చెక్పోస్టును మరింత పటిష్టంగా నిర్వహిస్తామన్నారు. కొత్తవలస పోలీస్స్టేషన్ పరిధిలో ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సీఐలు సీహెచ్.షణ్ముకరావు, ఎల్.అప్పలనాయుడు, తదితరులు పాల్గొన్నారు.
ఎస్పీ ఏఆర్ దామోదర్


