● రామతీర్థం శ్రీరామనవమి ఉత్సవాలపై అధికారుల సమీక్ష
నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం శ్రీ సీతారామస్వామి దేవస్థానంలో ఈ నెల 27న ప్రభుత్వ లాంఛనాలతో జరగనున్న శ్రీరామనవమి ఉత్సవాలపై అధికారులు శనివారం సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ఆర్డీఓ ఎం.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ శ్రీరామనవమి వేడుకల విజయవంతానికి అన్ని శాఖల అధికారులు సమష్టిగా కృషి చేయాలన్నారు. కల్యాణ వేదిక, ఆలయ పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచాలని, మూడు రోజుల ముందుగానే పారిశుద్య సిబ్బందిని ఏర్పాటు చేసి చెత్త సేకరణ పనులు చేపట్టాలన్నారు. విద్యుత్, ఫైర్, ఎకై ్సజ్, వైద్యారోగ్య, దేవదాయ శాఖ సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈఓ వై.శ్రీనివాసరావు మాట్లాడుతూ శ్రీరామనవమి ఉత్సవాలకు సంబంధించి సుమారు 10వేల మందికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశామని, కల్యాణం అనంతరం ప్రత్యేక కౌంటర్ల ద్వారా తలంబ్రాలను పంపిణీ చేస్తామన్నారు. సామాన్య భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా వివిధ శాఖల అధికారులు సహకరించాలని కోరారు. కల్యాణోత్సవంలో పాల్గొనే దంపతులు రూ.1500 చెల్లించి టిక్కెట్లు కొనుగోలు చేయాలని వారికి శేష వస్త్రాలు, తలంబ్రాలు, స్వామి ప్రసాదాన్ని అందిస్తామని చెప్పారు. ఉచిత దర్శనంతో పాటు, టిక్కెట్టుతో ప్రత్యేక దర్శనం ఉంటుందన్నారు. సీఐ రామకృష్ణ మాట్లాడుతూ గత ఏడాది శ్రీరామనవమికి కల్యాణం అనంతరం వేదికపైకి భక్తులు గుంపులుగా వెళ్లి అసౌకర్యం కల్పించారని, అదుపు చేయలేని పరిస్థితి తలెత్తిందన్నారు. ఈ సారి అలా జరగకుండా ప్రత్యేక కార్యాచరణ రూపొందించామని చెప్పారు. ఎమ్మెల్యే లోకం నాగమాధవి, నాయకులు సువ్వాడ రవిశేఖర్, చనమళ్లు వెంకటరమణ, గేదెల రాజారావు, కంచరాపు రాము, తహసీల్దార్ శ్రీకాంత్, ఎస్సై గణేష్ తదితరులు పాల్గొన్నారు.


