కురుపాం: ప్రభుత్వ పాఠశాలల్లో నిష్ణాతులైన ఉపాధ్యాయులు ఉన్నారని, పిల్లలను ఊరిబడిలో చేర్పించి వారి భవితను బంగారుమయం చేయాలంటూ విద్యార్థుల తల్లిదండ్రులకు విద్యావేత్తలు, ఉపాధ్యాయులు పిలుపునిచ్చారు. యుటీఎఫ్ జిల్లా కార్యదర్శి ఎన్.శ్రీరాములు ఆధ్వర్యంలో కురుపాం రావాడ కూడలిలో శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కేజీబీవీ పాఠశాలల గౌరవ అధ్యక్షురాలు కె.విజయగౌరి మాట్లాడుతూ ప్రభుత్వ బడులు కేవలం విద్యను బోధించే స్థలాలు మాత్రమే కాకుండా, పిల్లల్లో నైతిక విలువలు, సామాజిక బాధ్యత, సమానత్వ భావనలను పెంపొందించే కేంద్రాలని పేర్కొన్నారు. గాంధీ, నెహ్రూ, అంబేడ్కర్, అబ్దుల్ కలాం వంటి మహానుభావులు ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివి ప్రపంచానికి ఆదర్శంగా నిలిచారని గుర్తుచేశారు. ప్రస్తుతం ప్రభుత్వ బడుల్లో సాంకేతిక పరిజ్ఞానంతో బోధన, ఉచిత పుస్తకాలు, యూనిఫాంలు, బూట్లు, మధ్యాహ్న భోజనం వంటి సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని వివరించారు.
చిన్ననాటి నుంచే పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేలా ఉపాధ్యాయులు పాఠ్యాంశబోధన చేస్తున్నారని, ఆహ్లాదకర వాతావరణంలో చదువులు సాగుతున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వ బడుల్లో చదివే పిల్లల వ్యక్తిగత అభివృద్ధితోపాటు సమాజానికి ఉపయోగపడే బాధ్యతాయుత పౌరులుగా ఎదుగుతారన్నారు. ప్రభుత్వ పాఠశాలల ప్రాధాన్యతను వివరించారు.


