● డీఎంహెచ్ఓ భాస్కరరావు
పార్వతీపురం రూరల్: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను (పీహెచ్సీ) ఆహ్లాదకరంగా తీర్చిదిద్ది, రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యమని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి (డీఎంహెచ్ఓ) డాక్టర్ ఎస్.భాస్కరరావు పేర్కొన్నారు. పెదబొండపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని ఓపీ, ల్యాబ్, ఫార్మసీ విభాగాలను పరిశీలించి, రోగుల ఆరోగ్య సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రి పరిసరాలను సుందరంగా ముస్తాబుచేసి, రోగులకు మానసిక ప్రశాంతత చేకూర్చేలా వాతావరణాన్ని సిద్ధం చేయాలని సిబ్బందిని ఆదేశించారు. అనంతరం గర్భిణుల సంరక్షణ, బాలికలకు అందిస్తున్న హెచ్పీవీ వ్యాక్సినేషన్ పురోగతిపై వైద్యాధికారులతో సమీక్షించారు. గ్రామంలో ’ఫ్రైడే–డ్రైడే’ నిర్వహణను పర్యవేక్షించి, దోమల లార్వా నివారణకు తక్షణ చర్యలు చేపట్టాలని, వివరాలను వీసీహెచ్ యాప్లో నమోదుచేయాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో జిల్లా ఎన్సీడీ అధికారి డాక్టర్ టి.జగన్ మోహనరావు, వైద్యాధికారి డాక్టర్ జి.ధరణి, ఆరోగ్య పర్యవేక్షకులు వెంకటనాయుడు, జయలక్ష్మి పాల్గొన్నారు.


