బొండపల్లి: అతి వేగంగా వస్తూ వాహనాన్ని అదుపు చేయకపోవడంతో రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ స్తంభాన్ని బొలెరో వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. శుక్రవారం జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించి ఎస్ఐ యు.మహేష్ తెలిపిన వివరాలు.. పూసపాటిరేగ మండలం కోళ్లాయివలస గ్రామానికి చెందిన బొలెరో వాహనంలో అదే గ్రామానికి చెందిన ఐదుగురు గజపతినగరంలో గల కాంక్రీట్ మిక్సర్ యంత్రాన్ని వాహనంలో ఎక్కించి బయలుదేరారు. అతివేగంగా నడుపుతున్న బొలెరో జాతీయ రహదారి 26పై రోళ్లవాక జంక్షన్ వద్దకు వచ్చేసరికి అదుపు తప్పించి రహదారి పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అదే గ్రామానికి చెందిన నీలాపు రామసూరి(40) అక్కడికక్కడే మృతి చెందాడు. కాకి అసిరప్పడు, లావేటి అసిరినాయుడు, కంప పైడిరాజుతో పాటు వ్యాన్ డ్రైవర్ సాడి రాజేంద్ర తీవ్రంగా గాయపడినట్టు ఎస్ఐ తెలిపారు. క్షతగాత్రులను 108 వాహనంలో జిల్లా కేంద్రంలో కేంద్ర సర్వజన ఆస్పత్రికి తరలించారు. రామసూరి మృతదేహాన్ని పంచనామా నిమిత్తం జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. మృతుని బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు.
నలుగురికి తీవ్ర గాయాలు


