వీరఘట్టం: రాంగ్ రూట్లో వచ్చిన ఓ ఆటో ఎదురుగా వస్తున్న బొలెరా వాహనాన్ని ఢీ కొట్టిన ప్రమాదంలో ఐదుగురు గాయపడినట్టు ఎస్.ఐ ఎస్.షణ్ముఖరావు తెలిపారు. దీనికి సంబంధించి వివరాలు... మండలంలోని కడకెల్ల సమీపంలో సీఎస్పీ రహదారిపై శుక్రవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో చింతా వీర్రాజు, వరలక్ష్మి, ఇసుకపల్లి మంగమ్మ, చింతా జీవన్కుమార్, మన్య హర్షవర్ధన్కు గాయాలయ్యాయి. పాలకొండ మండలం బడ్డుమాసింగికి చెందిన వీరంతా ఉదయం రాయగఢ మజ్జి గౌరమ్మను దర్శించుకునేందుకు ఆటోలో వెళ్లి తిరిగి వస్తుండగా కడకెల్ల–రావివలస మధ్యలో ఈ ప్రమాదం జరిగినట్లు ఎస్.ఐ తెలిపారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్.ఐ తెలిపారు. క్షతగాత్రుల్లో చింతా వీర్రాజు, వరలక్ష్మిలకు తీవ్ర గాయాలవ్వడంతో పాలకొండ తరలించారు. ఇసుకపల్లి మంగమ్మకు కాలు విరిగిపోగా చేతికి గాయాలయ్యాయి. చింతా జీవన్కుమార్, మన్య హర్షవర్ధన్లకు తలపై గాయాలయ్యాయి. వీరిని కూడా పాలకొండలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అంతకు ముందు 108 సిబ్బంది జగదీష్, తిరుపతిరావులు క్షతగాత్రులకు ప్రధమ చికిత్స అందజేశారు.
ఆటోలో ఉన్న ఐదుగురికి గాయాలు


