పోలమాంబ దర్శనానికి పోటెత్తిన భక్తులు
మక్కువ: ఉత్తరాంధ్రుల ఇలవేల్పు శంబరపోలమాంబ అమ్మవారి మూడవ జాతర మంగళవారం అంగరంగ వైభవంగా జరిగింది. తెల్లవారు జామునుంచి ఇతర జిల్లాలు, మండలాల నుంది వేలాదిమంది భక్తులు శంబర గ్రామానికి చేరుకున్నారు. భక్తులతో శంబర గ్రామం కిటకిటలాడింది. చదురుగుడిలో కొలువైన శంబర పోలమాంబ అమ్మవారిని భక్తులు దర్శించుకుని, అనంతరం గోముఖి నది ఆవలి ఒడ్డున ఉన్న వనంగుడిలో కొలువుదీరిన పెదపోలమాంబ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయం వెనుక ఉన్న వేపచెట్టు వద్ద భక్తులు పూజలు నిర్వహించారు.
మొక్కుబడులు చెల్లించుకున్న భక్తులు
చదురుగుడి, వనంగుడి, గోముఖి నది ఒడ్డున భక్తులు అమ్మవారికి కోళ్లు, మేకలు, చీరలు మొక్కుబడులు చెల్లించుకున్నారు. చిన్నారులు తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు చీపుళ్లతో రహదారులను శుభ్రపరుస్తూ, ఘటాలను అమ్మవారికి సమర్పిస్తూ మొక్కుబడులు చెల్లించుకున్నారు.
ఎండలో బారులు తీరిన భక్తులు
పోలమాంబ అమ్మవారి దర్శనానికి వేలాదిమంది భక్తులు ఉదయం 9గంటల తరువాత ఒక్కసారిగా చేరుకోవడంతో, క్యూలన్నీ భక్తులతో నిండిపోయాయి. ఆరుబయట ఎండలో గోముఖి బ్రిడ్జి వరకు భక్తులు అమ్మదర్శనానికి బారులు తీరారు. భక్తులు అత్యధికంగా ఉచితదర్శనం క్యూల వైపు చేరుకోవడంతో, స్వల్ప తోపులాటలకు తావివ్వడంతో, పోలీస్ సిబ్బంది అప్రమత్తమై బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భక్తులను అమ్మదర్శనానికి పంపించారు. అమ్మవారిని ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్యెల్సీ గాదె శ్రీనివాసులునాయుడు దర్శించుకున్నారు.
గోముఖి నది బ్రిడ్జిపై భక్తులు
పోలమాంబ దర్శనానికి పోటెత్తిన భక్తులు
పోలమాంబ దర్శనానికి పోటెత్తిన భక్తులు
పోలమాంబ దర్శనానికి పోటెత్తిన భక్తులు
పోలమాంబ దర్శనానికి పోటెత్తిన భక్తులు


