
గిరిజన రైతుల హక్కులు కాలరాస్తే సహించం
● సాగుచేసిన భూములు వారి
స్వాధీనంలోనే ఉండాలి
● మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర,
● మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట
చినఅప్పలనాయుడు
● కాకర్లవలస, కారేడువలసలో భూముల పరిశీలన
రామభద్రపురం: ఎన్నోఏళ్లుగా సాగులో ఉన్న భూములపై సర్వ హక్కులు గిరిజన రైతులవేనని వారి హక్కులను కాలరాస్తే సహించేది లేదని మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర, మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు హెచ్చరించారు. ఈ మేరకు రామభద్రపురం మండలంలోని కాకర్లవలస, కారేడువలస గిరిజన రైతులు చాలా రోజులుగా భూసమస్యలపై పోరాడుతున్న సమాచారం తెలుసుకున్న వారు బుధవారం ఎంపీపీ చొక్కాపు లక్ష్మణరావు, పలువురు వైఎస్సార్సీపీ నాయకులతో కలిిసి ఆయా భూములను పరిశీలించారు.ఈ భూముల్లో ఎప్పటి నుంచి సాగులో ఉన్నారు? మీ దగ్గర నుంచి తీసుకునేటప్పుడు మీకు నోటీసులు ఇచ్చారా లేదా? అని ఆరా తీస్తూ గిరిజన రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఏపీఐఐసీ అధికారులు, ఎంఎస్ఎంఈ పార్కు ఏర్పాటు కోసం పేదల పొట్టగొడుతూ మేము ఎన్నో ఏళ్లుగా కష్టపడి సాగుచేసుకుంటున్న పంటలు సైతం దౌర్జన్యంగా నాశనం చేయడంతో పాటు లాక్కుంటున్నారని గిరిజన రైతులు వారి దృష్టికి తీసుకెళ్లారు.అలాగే దశాబ్దాల కాలంగా మేము సాగులో ఉన్న ఇవే భూములకు పట్టాలు ఇవ్వాలని పోరాటాలు చేస్తే రెవెన్యూ అధికారులు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు ఇచ్చారని వారి వద్ద గిరిజన రైతులు ఆవేదన వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ అధికారం ఉపయోగించి పోలీసుల సహకారంతో దౌర్జన్యంగా చేసి గిరిజనులను భయపెట్టడం సమంజసం కాదన్నారు. ఆరుగాలం కష్టపడి పెంచుకుంటున్న మామిడి తోటలు, జీడి తోటలు, మొక్కజొన్న, పత్తి పంటలు ధ్వంసం చేయడానికి ఏపీఐఐసీ అధికారులకు మనసు ఎలా వచ్చిందని ప్రశ్నించారు. తాము అభివృద్ధికి అడ్డుకాదని, ప్రభుత్వ ప్రయోజనాలు, ప్రజాప్రయోజనాల కోసమో సాగుభూముల్లో పనులు చేస్తే పద్ధతిని పాటిస్తూ ముందుకెళ్లాలన్నారు.
పాలన ఇలాగేనా?
ఇక్కడ పంచాయతీ సర్పంచ్కు గాని, గిరిజన రైతులకు కానీ కనీస సమాచారం ఇవ్వకుండా ఎలా లాక్కుంటారని ప్రశ్నించారు. గిరిజన ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని,గిరిజన ప్రజలకు మంచి చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్లు ఇలాగేనా పాలించేది అని ప్రశ్నించారు. 2009లో వనసంరక్షణ కింద అప్పటి కలెక్టర్ వీర బ్రహ్మయ్య గిరిజనులకు పట్టాలు ఇచ్చారని,అప్పటికే ఎన్నో ఏళ్ల నుంచి బీడు భూములను బాగు చేసుకుని గిరిజన రైతులు సాగులో ఉంటే ఇప్పుడు ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. గిరిజన రైతులేమీ దొంగతనంగా ఆక్రమించుకోలేదన్నారు. దౌర్జన్యంగా ధ్వంసం చేసిన పంటలకు నష్టపరిహారం ఇవ్వడంతో పాటు గిరిజన రైతులకు కొండ ప్రాంతంలో కాకుండా ఈ భూములకే పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గిరిజన రైతులకు న్యాయం జరిగే వరకు వారికి అండగా ఉంటామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ చొక్కాపు లక్ష్మణరావు, గ్రామ సర్పంచ్ మజ్జి రాంబాబు, మండల జేసీఎస్ కన్వీనర్ చింతల సింహాచలం నాయుడు, మండల యూత్ అధ్యక్షుడు పత్తిగుళ్ల ఏక్నాథ్, పీఏసీఎస్ మాజీ చైర్మన్ కిర్ల చంద్రశేఖర్ సీఐటీయూ నాయకుడు బలస శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

గిరిజన రైతుల హక్కులు కాలరాస్తే సహించం