వేపాడ: మండలంలోని వల్లంపూడి సమీపంలో ఆటోలో రవాణా చేస్తున్న పీడీఎస్ బియ్యాన్ని వల్లంపూడి పోలీసులు పట్టుకున్నట్లు ఎస్సై సుదర్శన్ ఆదివారం తెలిపారు. పట్టుబడిన బియ్యం, వాహనం స్టేషన్లో ఉంచామని సోమవారం రెవెన్యూ అధికారులకు అప్పగించనున్నట్లు ఎస్సై చెప్పారు. పట్టుబడిన బియ్యం సుమారు 350 కేజీలు ఉంటాయన్నారు.
రాష్ట్రస్థాయి పోటీల్లో సత్తా చాటాలి
● పారా స్పోర్ట్స్ అసోసియేషన్
గౌరవాధ్యక్షుడు దయానంద్
విజయనగరం: పారా జూనియర్, సబ్ జూనియర్స్ అథ్లెటిక్స్ జిల్లా స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై న జిల్లా క్రీడాకారులు అక్కడ కూడా సత్తా చాటాలని పారా స్పోర్ట్స్ అసోసియేషన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు కె.దయానంద్ అన్నారు. ఈ మేరకు ఆదివారం విజయనగరంలో గల సారథి వెల్ఫేర్ అసోసియేషన్ బ్లైండ్ స్కూల్లో నిర్వహించిన అభినందన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా స్థాయి పోటీల్లో ఉమ్మడి విజయనగరం జిల్లా నుంచి 135 మంది పారా క్రీడాకారులు పాల్గొన్నారని, వారిలో 47 మంది అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయికి ఎంపిక కావడం అభినందనీయమన్నారు. పాతవారితో పాటు మొదటిసారి పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులు కూడా అత్యుత్తమ ప్రతిభ కనబరచడం ఆనందంగా ఉందన్నారు. ఇదే స్ఫూర్తితో ఈనెల 9 న విశాఖపట్నంలో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో కూడా సత్తా చాటి జిల్లాకు పేరు తీసుకురావాలని, అలాగే హర్యానాలో జరగబోయే జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కావాలని కోరారు. అనంతరం రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై న క్రీడాకారులకు పుస్తకాలను అందజేశారు. కార్యక్రమంలో సారథి వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపకుడు ప్రదీప్, అమ్మ సేవా సంఘం వ్యవస్థాపకుడు లక్కీ శేఖర్, మహేష్, కిరణ్ కుమార్, శర్మ, వెంకటరావు, పారా క్రీడాకారులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
అథ్లెటిక్స్ పోటీలకు జిల్లా క్రీడాకారుల ఎంపిక
విజయనగరం: రాష్ట్రస్థాయిలో జరగనున్న అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొనబోయే జిల్లా క్రీడాకారుల ఎంపిక పోటీలు ఆదివారం పూర్తయ్యాయి. జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నగర శివారులో గల విజ్జి స్టేడియంలో నిర్వహించిన ఎంపిక పోటీల్లో ఉమ్మడి విజయనగరం జిల్లా నుంచి సుమారు 600 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. వారికి వివిధ విభాగాల్లో పరుగు పోటీలతో పాటు లాంగ్ జంప్, షాట్పుట్, హైజంప్, జావెలిన్ త్రో తదితర అంశాల్లో పోటీలు నిర్వహించారు. ఈ ఎంపికలను జిల్లా క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ పి.సీతారామరాజు, జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు ఐవీపీ రాజు ప్రారంభించారు. ఎంపిక పోటీల్లో ఉత్తమ ప్రతిభభ కనబరిచిన క్రీడాకారులను ఈనెల 9,10,11 తేదీల్లో బాపట్ల జిల్లా చీరాల జిల్లాలో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నట్లు అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పి.లీలాకృష్ణ, కార్యదర్శి శ్రీకాంత్లు తెలిపారు. కార్యక్రమంలో పలువురు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రతినిధులు, టెక్నికల్ ఆఫీషియల్స్, సీనియర్ అథ్లెట్లు పాల్గొన్నారు.
పట్టుబడిన పీడీఎస్ బియ్యం
పట్టుబడిన పీడీఎస్ బియ్యం
పట్టుబడిన పీడీఎస్ బియ్యం
పట్టుబడిన పీడీఎస్ బియ్యం