
మత్తు రహిత భారతదేశం మనందరి లక్ష్యం
విజయనగరం లీగల్:
యువత మత్తు పదార్థాలకు బానిసవుతోందని దానివల్ల వారి భవిష్యత్తు, అలాగే దేశ భవిష్యత్తు దేశ ఆర్థిక పరిస్థితి దిగజారుతుందని విజయనగరం జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.బబిత అన్నారు. ఈ మేరకు ఆమె ఆధ్వర్యంలో సోమవారం విజయనగరంలోని ఫూల్బాగ్లో ఉన్న నూతన జిల్లా కోర్టు కాన్ఫరెన్స్ హాల్లో న్యాయశాఖ సిబ్బందికి న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భగా ఆమె మాట్లాడుతూ జాతీయ న్యాయ సేవా అధికార సంస్థ మాదకద్రవ్యాలపై అవగాహనతో పాటు వారి క్షేమం అనే పథకాన్ని జాతీయ న్యాయ సేవా అధికార సంస్థ ప్రారంభించిందని చెప్పారు. ఈ పథకానికి సంబంధించి న్యాయశాఖ ఉద్యోగులందరికీ అవగాహన కల్పించామని తెలిపారు. అనంతరం న్యాయశాఖ ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడుతూ ఉద్యోగులు మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా ఉండాలని మత్తు పదార్థాలకు బానిసలైన పక్షంలో సరిగ్గా విధులు నిర్వహించలేరన్నారు. విధి నిర్వహణలో ఎవరైనా ఉద్యోగులు ఆల్కహాల్ స్వీకరించినట్లు తెలిస్తే వారిపై శాఖాపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి ఎ.కృష్ణ ప్రసాద్, డాక్టర్ న్యూరో సైకియాట్రిస్ట్ నిమ్స్ కాలేజ్ ప్రొఫెసర్ విముక్తి సీడ్ సంస్థ కౌన్సిలర్ విజయనిర్మల తదితరులు పాల్గొన్నారు.
జిల్లా ప్రధాన న్యాయమూర్తి బబిత