
బాధ్యతగా పనిచేయండి
సీతంపేట: బాధ్యతగా పనిచేసి గిరిజన విద్యా సంస్థలకు మంచి పేరు తీసుకురావాలని ఐటీడీఏ పీఓ సి.యశ్వంత్కుమార్ రెడ్డి అన్నారు. ఐటీడీఏ పరిధిలోని వివిధ ఆశ్రమ పాఠశాలల హెచ్ఎంలు, గురుకులాల ప్రిన్సిపాళ్లు, హెచ్డబ్ల్యూఓలతో సోమవారం సమావేశమయ్యారు. టెన్త్ ఫలితాలపై సమీక్షించారు. ఫలితాల సాధనలో వెనుకబడిన హెచ్ఎంలకు పలు సూచనలు చేశారు. ఉత్తమ ఫలితాలు సాధించిన పాఠశాలల హెచ్ఎంలను అభినందించారు. పాఠశాలల్లో ఎన్రోల్మెంట్ డ్రైవ్ నిర్వహించాలన్నారు. ఏ ఒక్క విద్యార్థి డ్రాపౌట్ అవ్వకూడదన్నారు. చదువులో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని సూచించారు. మెనూ పక్కాగా అమలు చేయాలన్నారు. పాఠశాలలు పునఃప్రారంభం నాటికి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలన్నారు. వాటర్ ట్యాంక్, ఆర్వో ప్లాంట్లను పరిశుభ్రం చేయించాలన్నారు. విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు చేయించాలన్నారు. కార్యక్రమంలో ఏపీఓ చిన్నబాబు, గిరిజన సంక్షేమ శాఖ డీడీ అన్నదొర, ఏటీడబ్ల్యూఓ మంగవేణి, శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.
పాఠశాలల్లో ఎన్రోల్మెంట్ డ్రైవ్ నిర్వహించాలి
ఐటీడీఏ పీఓ యశ్వంత్కుమార్ రెడ్డి