
● ఇష్టానుసారం ఉద్యోగుల బదిలీలు ● రెండు గంటల్లోనే ఒకరి ఉ
సాక్షి, పార్వతీపురం మన్యం:
ఐసీడీఎస్లో బదిలీలు పెట్టిన చిచ్చు.. చల్లారేలా కనిపించడం లేదు. అక్రమంగా సాగిన ఈ ప్రక్రియ కొంతమందికి లబ్ధి కలిగిస్తే.. మరికొందరికి ఖేదాన్ని మిగిల్చింది. విశాఖ జోనల్ పరిధిలో ఆర్జేడీ కార్యాలయం నుంచి సాగిన పైసా వసూల్ బదిలీలు.. చివరికి న్యాయస్థానం మెట్లు ఎక్కే వరకూ సాగేలా ఉంది. ప్రభుత్వం వివిధ శాఖల్లో బదిలీలకు అవకాశం కల్పించిన విషయం విదితమే. ఈ నెల 9వ తేదీతో ఆ ప్రక్రియ ముగిసింది. విశాఖ జోనల్ పరిధిలోని విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో ఈ తంతు వివాదాస్పదంగా మారింది. మొత్తం ఆర్జేడీ కార్యాలయం నుంచి చక్రం తిప్పిన ఓ సీనియర్ సహాయకుడు.. ఉన్నతాధికారులకు భారీగా ముడుపులు అప్పగించినట్లు తెలుస్తోంది. ఇష్టానుసారం, వేలంపాట మాదిరి చేపట్టిన బదిలీలే ఇందుకు సాక్ష్యంగా ఉన్నాయి.
●విజయనగరం జిల్లాలోని ఓ ప్రాజెక్టు సీడీపీవోను బదిలీ చేస్తూ సాయంత్రం 5.30కి ఉత్తర్వులు అందాయి. మరొకరికి ఆ స్థానంలో నియమించేశారు కూడా. అక్కడ నుంచి కదలడానికి ఇష్టపడని సదరు సీడీపీవో.. తనకున్న పలుకుబడితో కేవలం రెండు గంటల్లోనే ఉత్తర్వులు మార్పు చేసుకున్నారు. మరలా యథా స్థానంలో కొనసాగేందుకు సఫలీకృతులయ్యారు. ఈ క్రమంలో పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ఆ శాఖలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
●బదిలీలను ఇష్టానుసారం.. తమకు నచ్చిన విధంగా చేసి పడేశారు. రెండేళ్లు పూర్తి కాకపోయినా.. ‘రిక్వెస్’ పెట్టుకోకపోయినా స్థానచలనం కలిగించారు. ఓ ప్రాజెక్టు సూపర్వైజర్.. కనీసం విజ్ఞప్తి కూడా పెట్టుకోలేదు. ఆమెకు ‘రిక్వెస్ట్’ పెట్టుకున్నట్లుగా కారణం చూపుతూ పార్వతీపురం మన్యం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతానికి బదిలీ చేశారు.
●చీపురుపల్లి నియోజకవర్గం నుంచి గ్రేడ్–2 సూపర్వైజర్గా రెండేళ్ల కిందట ఉద్యోగోన్నతిపై ఒక సూపర్వైజర్ గజపతినగరం నియోజకవర్గంలోని ప్రాజెక్టుకు వెళ్లారు. వాస్తవానికి ఆమెకు బదిలీకి అవకాశం లేదు. తాజా బదిలీల్లో ఆమెను తన సొంత ప్రాంతమైన చీపురుపల్లి నియోజకవర్గానికే మరలా వేయడం గమనార్హం. ప్రస్తుతం పనిచేస్తున్న చోట రెండేళ్లయినా సర్వీసు పూర్తి కాని ఓ సూపర్వైజర్కు భోగాపురం నుంచి గంట్యాడ పోస్టింగ్ ఇచ్చారు.
●వితంతువులు, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి కాస్త వెసులుబాటు ఇవ్వాల్సి ఉంది. ఈ శాఖలో వితంతువుల విషయంలో ఒక్కొక్కరికీ ఒక్కోలా వ్యవహరించారు. కేన్సర్తో బాధ పడుతున్న ఓ ప్రాజెక్టు సూపర్వైజర్.. చికిత్సకు వీలుగా ఉంటుందని, విశాఖపట్నంలో తనకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేసుకున్నారు. ఆమె విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకోలేదు. ప్రస్తుతం ఉన్నచోటే ఉంచేశామని.. సంతోషించాలని ఆర్జేడీ కార్యాలయం నుంచి సమాధానం రావడం విశేషం. ఎవరికో లబ్ధి కలిగించాలని.. వేరెవరినో బలిచేస్తూ బదిలీల తంతు సాగింది. 50 ఏళ్లు దాటిన వారికి ఏజెన్సీలోని కొండ ప్రాంతాలకు వేశారు.
●పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గం నుంచి ఓ సూపర్వైజర్ను విజయనగరం జిల్లాకు బదిలీ చేశారు. మన్యం జిల్లాలో ఆ స్థానంలోకి కొత్తగా వస్తున్న వారు విధుల్లో చేరితేనే.. ప్రస్తుతం ఉన్నవారిని రిలీవ్ చేయాలని కలెక్టర్ స్పష్టం చేసినట్లు సమాచారం. ఇదే సమయంలో విజయనగరం జిల్లాలో ప్రస్తుతం ఉన్న సూపర్వైజర్లు ఇంకా రిలీవ్ ఆర్డర్లు తీసుకోకుండానే సీడీపీవోలు అత్యుత్సాహం చూపినట్లు తెలుస్తోంది. తమకు కొంత సమయం ఇవ్వాలని కోరుతున్నా.. సంబంధిత సూపర్వైజర్లను రిలీవ్ చేస్తున్నట్లుగా వారి వ్యక్తిగత మెయిల్కు ఆర్డర్లు పంపేశారు.
చక్రం తిప్పుతున్న ఆ వ్యక్తి ఎవరు?
ఐసీడీఎస్లో వేలంపాట మాదిరి జరిగిన బదిలీల తంతులో ఆర్జేడీ కార్యాలయం చుట్టూనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉన్నతాధికారికి లబ్ధి కలిగించేందుకు ఓ సీనియర్ సహాయకుడు చక్రం తిప్పుతున్నట్లు సమాచారం. గతంలో విజయనగరం జిల్లాలోని ఓ ప్రాజెక్టు సీడీపీవో వేధింపులు భరించలేక.. పలువురు అంగన్వాడీ కార్యకర్తలు తమ వివరాలను గోప్యంగా ఉంచుతూ, విషయాన్ని లేఖ రూపంలో ఆర్జేడీ కార్యాలయానికి పంపారు. దీనిపై ఎటువంటి విచారణ కూడా చేపట్టకుండా సదరు ఉద్యోగితోపాటు.. మరో కీలకాధికారి ఆ ఫిర్యాదును కనుమరుగు చేసినట్లు సమాచారం. మరోవైపు అస్తవ్యస్తంగా చేపట్టిన బదిలీలపై తీవ్ర అసంతృప్తితో ఉన్న పలువురు ఉద్యోగులు న్యాయస్థానం తలుపుతట్టేందుకు సిద్ధమవుతున్నారు.