
ముందస్తు నివారణ లేకపోతే..‘చిటుక’లో గొర్రెల మృతి..!
● రోగాన్ని నిర్లక్ష్యం చేయవద్దు
● టీకాలు వేయిస్తే వ్యాధి నివారణ
● తొలకరి వర్షాలు, అకాల వర్షాలకు మొలిచిన గడ్డిని వేయరాదు
● పశు సంవర్థక శాఖాధికారుల సూచనలు
రామభద్రపురం: గొర్రెల పెంపకందారులకు తీవ్రనష్టం కలిగించే వ్యాధి ‘చిటుక’ రోగం. ఇందులో 40 శాతం వరకు మరణాల రేటు ఉంటుంది. ఈ వ్యాధి సోకిన గొర్రెలు నిమిషాల్లోనే చనిపోతాయి. గొర్రెల పెంపకందారులు ప్రధానంగా చిటుక రోగంపై అప్రమత్తంగా ఉండాలి. ఈ వ్యాధి సోకితే చిటికెలో వెంటనే మరణించే ప్రమాదం ఉండడం వల్ల దీనిని చిటుక రోగం అంటారు. జిల్లాలో 1,30,180 గొర్రెలు, 43,101 మేకలు ఉన్నాయి. వాటికి ఈ వ్యాధి సోకుండా, అలాగే వ్యాధి నివారణకు ప్రభుత్వం ఇప్పటికే టీకాలు వేసే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ వ్యాధితో గొర్రెలకు నష్టం జరగకుండా ఉండేందుకు టీకాలు వేయించాల్సిన అవసరం ఉంది. టీకాల కార్యక్రమం మొదలైన నేపథ్యంలో గొర్రెల్లో ఈ వ్యాధి ఎప్పుడు వస్తుంది?లక్షణాలు ఎలా ఉంటాయి?నివారణ పద్ధతులపై పశుసంవర్ధక శాఖాధికారులు సలహాలు, సూచనలు ఇస్తున్నారు.
టీకాలు వేయిడంతో వ్యాధి నివారణ..
గొర్రెలు, మేకల్లో గాలికుంటు, మశూచి, పీపీఆర్, చిటుకు రోగం, దొమ్మ, గొంతువాపు మొదలైన అంటువ్యాధులు ఒక మంద నుంచి వేరే మందకు అత్యంత వేగంగా, సులభంగా వ్యాపించి ప్రాణనష్టం కలిగిస్తాయి. చాలా సందర్భాల్లో చికిత్స చేసేందుకు తగిన వ్యవధి కూడా ఉండదు. ఇలాంటి ప్రమాదకరమైన ప్రాణాంతకమైన వ్యాధులకు చికిత్స బదులు నివారణే శ్రేయస్కరం అని గుర్తించాలి. అంటు వ్యాధులు సోకక ముందే వ్యాఽధి నిరోధక టీకాలు వేయిస్తే గొర్రెలు, మేకల్లో రోగనిరోధక శక్తి పెంపొందుతుంది.
గొర్రెలకు ఎక్కువగా సోకే ప్రమాదం..
మేకల్లో ఈ వ్యాధి తీవ్రత అంతగా కనిపించదు.గొర్రెలకు ఎక్కువగా సోకే ప్రమాదం ఉంది. తొలకరిలో ఎక్కువగా వస్తుంది. తొలకరిలో పెరిగిన పచ్చికను అతిగా మేయడం వల్ల శరీరంలో ఎప్సిలాల్ అనే విష పదార్థం విడుదల కావడం వల్ల ఈ వ్యాధి సంభవిస్తుంది. మేతను తినేసి అకస్మాత్తుగా దాణాను మార్చడం వల్ల కూడా వచ్చే ప్రమాదం వచ్చే అవకాశం ఉంది.

ముందస్తు నివారణ లేకపోతే..‘చిటుక’లో గొర్రెల మృతి..!