
అస్తవ్యస్తంగా వరద కాలువలు
● నిలిచిపోయిన కల్వర్టుల నిర్మాణం
● ఆందోళనలో రైతులు
పార్వతీపురం రూరల్: ఓ వైపు వాతావరణంలో మార్పులు సంభవించి వానలు ముంచుకొస్తున్నప్పటికీ అధికారుల్లో మాత్రం కదలిక కనిపించడం లేదు. ఎక్కడ చూసినా పంట కాలువలు పూడికలతో నిండిపోయి వర్షం కురిస్తే వరదనీరు కాలువల ద్వారా చెరువుల్లోకి పారేందుకు ఆస్కారం లేకుండా అస్తవ్యస్తంగా దర్శనమిస్తున్నాయి. ఉపాధిహామీ పథకంలో పూడిక తీత వంటి పనులు చేపట్టే వెసులుబాటు ఉన్నా జిల్లా వ్యాప్తంగా ఎక్కడా ఆ ఊసే లేకుండా పోయింది. సంబంధిత అధికారులు ఇంతవరకు ఆ దిశగా చర్యలు తీసుకోనప్పటికీ ఏ ఛానల్లో ఎంత పరిధి నిధులు అవసరమన్నది ఉపాధి, నీటి పారుదల శాఖ అధికారులు సంయుక్తంగా సర్వే నిర్వహించి ప్రతిపాదనలు చేసి ఇప్పటికే పనులు పూర్తిచేయాలి. కానీ వాటి జోలికే అధికారులు వెళ్లలేదు.
ఎక్కడ చూసినా ఆధ్వానమే
జిల్లాలో చాలా వరకు పంటలకు ఆధారమైన పంట కాలువలు పూడికలతో నిండిపోయి వాటి ఆనవాళ్లే లేకుండా మారాయి. ప్రధానంగా చెరువులైతే వాటి విస్తీర్ణం తగ్గి బక్కచిక్కిన దుస్థితిలో దర్శనమిస్తున్నాయి. వాటికి సంబంధించిన భూములు కూడా శిథిలమయ్యాయి. గతంలో కూడా పనులు సక్రమంగా చేపట్టక వాటి లైనింగ్ పనులు పూర్తిగా పాడై పంట సాగుకు నీరు పారని దుస్థితిలో ఉన్నాయి. ఇప్పటికే వాటి పనులు జరిగి ఉంటే రైతులకు సాగునీటికి ఇబ్బంది ఉండేది కాదు. నాలుగు వారాల్లో పూర్తిచేయాలని కలెక్టర్ ఆదేశించినప్పటికీ ఎక్కడా పనులు ప్రారంభించిన దాఖలాలు కన్పించడం లేదు.
గిరిజన ప్రాంతాల్లో ఇదే దుస్థితి
జిల్లా వ్యాప్తంగా ఉన్న గిరిజన ప్రాంతాల్లో దాదాపుగా వందల కొద్దీ చెక్డ్యాంలు గతంలో నిర్మించారు. వాటితో గిరిజన రైతుల ఆయకట్టు భూమికి పుష్కలంగా సాగునీరు అందేది. సమీపంలో ఉన్న వాగుల ద్వారా చెరువులు, గెడ్డలు నిండి వాటి ద్వారా పంటలకు సాగునీరు అందించేందుకు కార్యాచరణ జరిగేది. ఈ క్రమంలో వేసవిలో కూడా గిరిజన రైతులు పంటలు పండించుకునేందుకు ఆస్కారం ఉండేది. కొన్నేళ్లుగా వాటివైపు చూసే నాథుడే లేక అలాగే చెక్డ్యాంల నిర్వహణ మరమ్మతులు జరగక కాలువల్లో పూడికలు పేరుకుపోయి రైతులను ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికిప్పుడు భారీ వర్షాలు కురిస్తే నీరు వృథాకావడమే కాకుండా లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వ్యవసాయ భూముల సైతం ముంపు బారిన పడక తప్పదని ఆప్రాంత గిరిజనులు వాపోతున్నారు.

అస్తవ్యస్తంగా వరద కాలువలు