
మెరుగైన వైద్య సేవలు కల్పించాలి
పార్వతీపురటౌన్: పార్వతీపురం మన్యం జిల్లాలో గణనీయమైన సంఖ్యలో గిరిజనులు, పేదలు నివసిస్తున్నారని జిల్లాలో ప్రధానంగా వైద్యానికి ప్రభుత్వ ఆస్పత్రులే ఆధారమని కానీ చాలా ఆస్పత్రుల్లో సరైన మౌలిక వసుతులు లేవని వెంటనే మెరుగుపరచాలని ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక కమిటీ సభ్యులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం అభివృద్ధి వేదిక కమిటీ సభ్యులు ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా జిల్లాలోని సాలూరు, కురుపాం, సీతంపేట, పార్వతీపురం ప్రభుత్వ ఆస్పత్రులను సందర్శించి, వైద్య సదుపాయాలపై రోగులు, ఆయా ఆస్పత్రుల సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. పర్యటన అనంతరం కలెక్టర్ కార్యాలయంలో డీఆర్ఓ హేమలతకు వినతిపత్రాన్ని అందించి సమస్యలను వివరించారు. వెంటనే వైద్య సదుపాయాలను మెరుగుపరిచే దిశగా చర్యలు చేపట్టాలని కోరారు.
ఒక బెడ్పై ఇద్దరు అంతకంటే ఎక్కువగా..
ఈ సందర్భంగా ఉత్తరాంధ్ర అభివద్ధి వేదిక ప్రధాన కార్యదర్శి ఎ.అజశర్మ మాట్లాడుతూ పార్వతీపురం జిల్లా కేంద్రంలోని ఆస్పత్రి 150 పడకలకు, సాలూరు ఆస్పత్రి 100 పడకలకు, కురుపాం 50 పడకలకు, భద్రగిరి 50 పడకలకు, సీతంపేట 250 పడకలకు అప్డేట్ అయినప్పటికీ భవన నిర్మాణాలు దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. దీని వల్ల ఒకే బెడ్పై ఇద్దరు అంతకంటే ఎక్కువ మంది పడుకోవలసి వస్తోందన్నారు. అంతే కాక సాలూరులో గైనకాలజిస్ట్లు ఉన్నా ఆపరేషన్ థియేటర్ అందుబాటులోకి రాలేదని, సాలురులో డాక్టర్ల కొరత కుడా చాలా ఎక్కువగా ఉందన్నారు. పార్వతీపురం జిల్లా ఆస్పత్రిలో కార్డియాలజీ, నెఫ్రాలజీ, ఆంకాలజీతో సహా అన్ని సూపర్ స్పెషాలిటీ సేవలు అందుబాటులోకి వచ్చేలా డాక్టర్లను నియమించాలని, ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజనులు అత్యధికంగా నివసించే ప్రాంతమైన మక్కువ మండలంలోని నంద, దుగ్గేరు, సాలూరు మండలంలోని కురుకూటి, పాచిపెంట మండలంలోని వేటగాని వలస వంటి ప్రాంతాల్లో అదనంగా పీహెచ్సీలను ఏర్పాటు చేయాల్సిన అవసరముందని వివరించారు. కార్యక్రమంలో కమిటీ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎం.శ్రీనివాస రావు, ఉపాధ్యక్షులు కె.విజయయగౌరి, వేదిక నాయకులు వెంకటరావు, ఎస్ఎఫ్ఐ విజయనగరం జిల్లా ఉపాధ్యక్షుడు రవికుమార్, సీఐటీయూ మన్యం జిల్లా కార్యదర్శి బీవీ రమణ, డీవైఎఫ్ఐ నాయకుడు పి.రాజశేఖర్ పాల్గొన్నారు.
ఉత్తరాంధ్ర అభివద్ధి వేదిక కమిటీ డిమాండ్
డీఆర్ఓకు వినతి పత్రం అందించిన కమిటీ సభ్యులు