
మాతాశిశు ఆరోగ్యం మెరుగుకు కృషి
● రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ఎ.డి అనిల్కుమార్
పార్వతీపురంటౌన్: మాతాశిశు ఆరోగ్య సేవలను బలోపేతం చేసే దిశగా వైద్యారోగ్యశాఖ అడుగులు వేస్తుందని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ అదనపు సంచాలకుడు డాక్టర్ కేవీఎస్ అనిల్కుమార్ పేర్కొన్నారు. ఈ మేరకు పార్వతీపురం మన్యం జిల్లాలో ఆరోగ్య కార్యక్రమాల అమలు తీరు పర్యవేక్షణకు విచ్చేసిన ఆయన గురువారం స్థానిక ఎన్జీఓ హోంలో డీఎంహెచ్ఓ డాక్టర్ ఎస్.భాస్కరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో పలు అంశాలపై ప్రస్తావించి సమీక్ష చేశారు. గర్భిణులకు వైద్యసేవలు మెరుగు పరిచే లక్ష్యంగా జననీ మిత్ర యాప్ ప్రవేశపెట్టినట్లు తెలిపారు. మాతాశిశు మరణాలు నివారించడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. స్టేట్ కన్సల్టెంట్స్ డా.నరేంద్ర, వెంకటేష్లు యాప్పై వైద్యసిబ్బందికి శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ డా.పద్మావతి, డీఐఓ డా.నారాయణరావు, ప్రోగ్రాం అధికారి డా.వినోద్, పీహెచ్సీల వైద్యాధికారులు, వైద్యసిబ్బంది తదితరులు పాల్గొన్నారు.