
కుట్రపూరితంగానే సాక్షిపై దాడులు
●మహిళలను కించపరిచే వ్యాఖ్యలు ఎవరు చేసినా ఖండించాల్సిందే..
●గతంలో విజయమ్మ, భారతమ్మలపై నీచంగా మాట్లాడారు..
●నాడు కూటమి నేతలకు అది తప్పు అనిపించలేదా?
●మాజీ ఉప ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యులు రాజన్నదొర
సాక్షి, పార్వతీపురం మన్యం/సాలూరు:
మహిళల పట్ల అసభ్యకరంగా ఎవరు మాట్లాడినా ఖండిస్తామని మాజీ ఉప ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యులు పీడిక రాజన్నదొర అన్నారు. భారతీయ సంస్కృతిలో మహిళలకు ఎనలేని గౌరవ మర్యాదలు ఇస్తామని చెప్పారు. అలాంటి మహిళలను అసభ్యకర పదజాలాలతో విశ్లేషకులు సంబోధించడాన్ని ఖండిస్తున్నామని తెలిపారు. సాలూరులోని తన నివాస గృహంలో మీడియాతో ఆయన బుధవారం మాట్లాడారు. సాక్షి టీవీ డిబేట్లో కొమ్మినేని శ్రీనివాసరా వు, విశ్లేషకులు కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యల పట్ల చింతిస్తున్నట్లు తెలిపారు. దానికి ఆయన క్షమాపణ చెప్పి వివరణ ఇచ్చుకున్నారని చెప్పారు. ఆ వ్యాఖ్యలను వైఎస్సార్ సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి, ఆయన సతీమణి భారతీరెఢ్డిలకు ఆపాదించడం తగదన్నారు. పార్టీ కూడా ఖండించిందని చెప్పారు.
ఈ వ్యవహారంలో డిబేట్ నిర్వహించిన సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్టు చేయడం సరికాదన్నారు. గతంలో ఎల్లో మీడియాకు చెందిన టీవీ చానళ్లలో మహిళలను కించపరిచేలా జర్నలిస్టులు, విశ్లేషకులు వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు. అది ఎవరికీ తప్పుగా కనిపించలేదా? అని ప్రశ్నించారు.
మాజీ సీఎం జగన్ కుటుంబాన్ని
కించపరచలేదా?
గతంలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులను కించపరుస్తూ అనేకమంది వ్యాఖ్యలు చేశారని రాజన్నదొర తెలిపారు. అప్పుడు లేని కేసులు, అరెస్టులు ఇప్పుడెలా చేస్తారని ప్రశ్నించా రు. ఇప్పటికీ వైఎస్ విజయమ్మ, భారతీరెడ్డిలను కించపరిచే వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయని చెప్పారు. వాటిపై కూటమి ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని, అవితప్పుగా కనిపించడం లేదా? అని నిలదీశారు.
సమావేశాల్లో కావచ్చు.. ప్రెస్ మీట్లో కావచ్చు, డిబేట్లో గానీ.. మాట్లాడే వారే బాధ్యులు అవుతార ని రాజన్నదొర అన్నారు. నిర్వహణ చేస్తున్న చాన ల్ పైన, ప్రింట్ మీడియాపైన తప్పును నెట్టడం భావ్యం కాదన్నారు. ‘సాక్షి’ మీడియాను కుట్ర పూరితంగా మూసివేయాలని చూస్తున్నారని.. అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఆ కార్యాలయాలపై ఈ దాడులని అనుమానం వ్యక్తం చేశారు. దీన్ని ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన అవసరం ఉందన్నారు.
కూటమి ప్రభుత్వ తప్పులను కప్పిపుచ్చడానికే...
ఈ నెల 4వ తేదీన వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమం చేపట్టామని రాజన్నదొర తెలిపారు. ఆ కార్యక్రమం రాష్ట్రమంతా విజయవంతమైందని.. ప్రజల్లో ప్రభుత్వంపైన అసమ్మతి పెరిగిందనడానికి ఇది నిదర్శనమని చెప్పారు. దీనిని కప్పిపుచ్చుకోవడానికి కూటమి ప్రభుత్వం రకరకాలుగా ఆలోచనలు చేస్తోందన్నారు.
గిరిజన బాలిక హత్యపై ఎందుకు స్పందించరు?
కూటమి ప్రభుత్వం మహిళల గురించి గొప్పగా చెప్పుకుంటోందని.. ఇదే సమయంలో అనంత పురం జిల్లాలో తన్మయ అనే గిరిజన అమ్మాయిని అన్యాయంగా చంపేశారని.. ఆ విషయంలో ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు. కేసు పెట్టడం కాదని.. ఆ కుటుంబాన్ని ఆదుకోవా ల్సి ఉందన్నారు. గిరిజనశాఖ మంత్రి ఏ విధంగా ఆదుకుంటున్నారో.. హోం శాఖ మంత్రి ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలన్నారు. ఒక దళిత బాలికపై సామూహిక అఘాయిత్యం జరిగిందని.. సాలూరు నియోజకవర్గం సామంతవలస, మర్రివలస సమీపంలో యువతిని దారుణంగా ఉరి వేసి చంపేశారని.. సాలూరు మండలంలో గిరిజన ఎంపీటీసీని జుట్టు పట్టుకుని కొట్టారని... వారికి ఏ న్యాయం చేశారని ప్రశ్నించారు. అప్పుడు మహిళ ల పట్ల ఈ గౌరవం ఎందుకు కనిపించలేదన్నారు. తాము గానీ, తమ అధినేత గానీ ఎప్పుడూ మహిళలకు అగ్రతాంబూలం ఇస్తామని గుర్తు చేశారు. అబలల మనోభావాలకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వెంటనే చర్యలు తీసుకునేలా అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వాలని కోరారు.