
సమస్యలతో రెడీ..!
సర్కారు బడి..
● నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం ● పూర్తికాని ఉపాధ్యాయుల బదిలీలు ● పనిచేయని ఆర్వో ప్లాంట్లు, మరమ్మత్తులకు గురైన మరుగుదొడ్లు ● మంజూరుకాని యూనిఫాంలు
పార్వతీపురం/సీతంపేట:
వేసవి సెలవులు ముగిశాయి. బడిగంట మోగే వేళయింది. పాఠశాలలకు వెళ్లేందుకు విద్యార్థులు చకచకా ముస్తాబవుతున్నారు. వీరికి పలు సమస్యలతో స్వాగతం పలికేందుకు చాలా సర్కారు బడు లు రెడీ అయ్యాయి. అధ్వాన పరిసరాలు, మూలకు చేరిన ఆర్వో ప్లాంట్లు, అసంపూర్తి భవన నిర్మాణాలే కనిపిస్తున్నాయి. నాడు–నేడు నిధులతో పూర్తిచేయాల్సిన అదనపు భవన నిర్మాణాలు ఏడాదిగా నిలిచిపోవడంతో ఈ ఏడాది కూడా విద్యార్థులను వసతి సమస్య వెంటాడనుంది. గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థుల ఆరోగ్య స్థితిగతులను చూసే హెల్త్ వలంటీర్లు లేరు. ఆరోగ్య కార్యకర్తలను నియమిస్తామని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి హామీ ఇచ్చి ఏడాది గడిచినా ఇంతవరకు కార్యరూపందాల్చలేదు.
నాడు సంస్కరణలు.. నేడు నిర్వీర్యం
ఏడాది కిందటి వరకు విద్యార్థులను ఊరి బడి ఆకర్షించేది. పాఠశాలల పునఃప్రారంభమంటే పండగలా ఉండేది. విద్యాకానుకలు, అమ్మఒడి, నాణ్యమైన ఆంగ్ల మీడియం చదువులు, అందంగా ముస్తాబైన పాఠశాలలు విద్యార్థులను మురిపించేవి. ప్రభుత్వం మారడంతో సర్కారు బడులకు ప్రాధా న్యం తగ్గిందని విద్యార్థుల తల్లిదండ్రులే చెబుతున్నారు. రెండోవిడత నాడు–నేడు పథకం కింద జిల్లాలోని 544 పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో చేపట్టిన పనులు అసంపూర్తిగా వదిలేయడాన్ని తప్పుబడుతున్నారు. పేద, మధ్యతరగతి పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దే సర్కారు బడులపై కూటమి ప్రభుత్వానికి నిర్లక్ష్యం తగదంటున్నారు. ఆందోళ నలు చేస్తే తప్ప తల్లికి వందనం నిధులు విడుదల చేయని స్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. మరోవైపు స్కూళ్ల విలీనం సన్నాహాలు విద్యార్థులు, వారి తల్లిదండ్రులను గందరగోళానికి చేరిచేస్తున్నాయి.
కొనసాగుతున్న ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియ
పార్వతీపురం మన్యం జిల్లాలో 2,232 మంది బదిలీల కోసం దరఖాస్తు చేశారు. మొదటి రోజు 400 మందికి బదిలీ అయ్యింది. ఈ బదిలీ ప్రక్రియ మరో ఐడు రోజులు కొనసాగే అవకాశం ఉంది. అప్పటివరకు విద్యార్థులకు ఉపాధ్యాయులు దూరంగా ఉండనున్నారు.
యూనిఫాం పెండింగ్
పార్వతీపురం మన్యం జిల్లాలోని 15 మండలాల్లో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు 1,503 ఉన్నాయి. ఈ పాఠశాలలో 89,173 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. విద్యార్థి కిట్లు కింద నోట్ పుస్తకాలు 4,87,214 వచ్చాయి. 89,173 బ్యాగ్లు, 64,476 బెల్ట్లు, 89,168 షూస్ వచ్చాయి. విద్యార్ధులకు సంబంధించి యూనిఫాం ఇంతవరకు మండల కేంద్రాలకు చేరలేదు.
బడులను బలోపేతం చేయాలి
ప్రభుత్వ బడులను బలోపేతం చేయాలి. కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలల దోపిడీకి అడ్డుకట్ట వేయాలి. ఇప్పటికే జిల్లాలోని ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాల ల్లో చేపడుతున్న దోపిడిపై అధికారులకు ఫిర్యాదుచేశాం. ప్రభుత్వ విధానం కార్పొరేట్ విద్యావ్యవస్థ కు బలం చేకూర్చేలా ఉంది.
– పాలక రంజిత్కుమార్, గిరిజన
సంక్షేమ సంఘ ఉత్తరాంధ్ర ప్రధాన కార్యదర్శి

సమస్యలతో రెడీ..!

సమస్యలతో రెడీ..!

సమస్యలతో రెడీ..!