
కూటమి ప్రభుత్వంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై పార్వతీపురంలో నిరసన ర్యాలీ
ఏపీలో మహిళలకు, బాలికలకు రక్షణ కరువు
దారుణాలు జరుగుతున్నా పట్టించుకోని కూటమి పాలకులు
అంబేడ్కర్ విగ్రహం వద్ద ఆందోళన
భద్రత కల్పించేలా చూడాలంటూ వినతి
పార్వతీపురం రూరల్: కూటమి ప్రభుత్వ పాలనలో మహిళపై జరుగుతున్న అఘాయిత్యాలు, దారుణాలపై మహిళలు నిరసన గళం వినిపించారు. ఆడబిడ్డలకు భద్రత కరువైందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలపై జరుగుతున్న అఘా యిత్యాలకు నిరసనగా వైఎస్సార్సీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు రెడ్డి పద్మ ఆధ్వర్యంలో పార్వతీపురం జిల్లా కేంద్రం ఇందిరా కాలనీ సమీపంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద ఆందోళన చేశారు. ఈ సందర్భంగా రెడ్డి పద్మ మాట్లాడుతూ కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మహిళలకు రక్షణ కరువైందన్నారు. టీడీపీకి చెందిన వ్యక్తులే రాష్ట్రంలో అరాచకాలు సృష్టిస్తున్నారని రుజువు అవుతున్నా హోం మంత్రికి చీమకుట్టినట్లు కూడా అన్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
నగిరిలో మైనర్ బాలికపై అత్యాచారం, అనంతపురంలో ఇంటర్ విద్యార్థిని కనిపించకపోతే పట్టించుకోకపోవడం దారుణమన్నారు. రాప్తాడులో టీడీపీకి చెందిన 14 మంది మైనర్ బాలికపై అత్యాచారం చేస్తే దర్యాప్తులో జాప్యం చేయడం విచారకరమన్నారు. ఎన్నికలకు ముందు ఊగిపోయిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం మహిళలపై జరుగుతున్న దాడులను పట్టించుకోకపోవడం దారుణమన్నారు. హోంమంత్రి అనిత నా చేతిలో గన్ ఉందా, నాకు పవర్ ఉందా అంటూ చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటని, మహిళలకు సురక్షితమైన పాలన అందించడం చేతకాకపోతే రాజీనామా చేసి తప్పుకోవాలన్నారు.
దిశ చట్టాన్ని నిర్వీర్యం చేశారు..
వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మహి ళల రక్షణకోసం తక్షణమే స్పందించే దిశ చట్టాన్ని నేటి కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేయడమే కాకుండా చట్టం కాలేదని వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని మహిళలు మండిపడ్డారు. బాలికలకై నా, మహిళలకై నా దిశ చట్టం పోలీసు వ్యవస్థ ద్వారా దన్నుగా ఉండేదని, ఏదైనా ఘటన జరిగితే స్పందన కూడా అంతే వేగంగా గత ప్రభుత్వంలో ఉండేదన్నారు. ప్రస్తుత ప్రభుత్వం మహిళల భద్రతను గాలికొదిలేసిందని, హోంమంత్రి ఒక మహిళ అయినప్పటికీ సాటి మహిళలకు రక్షణ లేకుండా చేస్తున్నారని విమర్శించారు. దారుణమైన ఘటనలు రోజురోజుకి రాష్ట్రంలో పెరుగుతున్నా ఎన్నో కుటుంబాలు శోక సంద్రంలో మునిగిపోతునా కూటమి నాయకులు మాత్రం ఇవేవీ పట్టకుండా జగన్మోహన్ రెడ్డిపై ఏవిధంగా బురద జల్లాలో ప్రణాళికలు వేసుకుంటూ తిట్టే పని పెట్టుకున్నారని విమర్శించారు. సేవ్ ఉమెన్.. సేవ్ ఆంధ్రా అంటూ నినాదాలు చేశారు.
నాడు మహిళలకు పెద్దపీట
గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మహిళలకు అన్ని రంగాల్లో పెద్దపీట వేశారన్నారు. మహిళల భద్రతపై జగనన్న దిశ యాప్ ద్వారా ప్రత్యేక న్యాయస్థానాలను ఏర్పాటు చేసి మహిళలకు అండగా నిలిచారన్నారు. ప్రతీ సంక్షేమ పథకాన్ని మహిళల ఖాతాల్లో వేస్తూ ప్రతీ మహిళ తమ కుటుంబం మొత్తం సమాజంలో గౌరవంగా బతికేలా సంస్కరణలు చేశారని వైఎస్సార్సీపీ మహిళ విభాగం నేతలు అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో శాంతి భద్రతలను గాలికొదిలేసి రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఈ దుష్టపాలనకు ముగింపు పలకాలని, అంబేడ్కర్ రాజ్యాంగం ఆచరణలోకి తేవాలంటూ అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నియోజక వర్గాల మహిళా విభాగం అధ్యక్షులు దాసరి నాగరత్నం, శెట్టి పద్మావతి, జంపు కన్నతల్లి, పార్వతీపురం మున్సిపల్ చైర్పర్సన్ బోను గౌరీశ్వరి, వైస్ చైర్మన్ కొండపల్లి రుక్మిణి, పార్వతీపురం ఎంపీపీ మజ్జి శోభారాణి, వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు, పలు అనుబంధ విభాగాల మహిళలు, నాయకులు పాల్గొన్నారు.

కోవిడ్ పరీక్షలకు ఏర్పాట్లు చేయండి

కోవిడ్ పరీక్షలకు ఏర్పాట్లు చేయండి

కోవిడ్ పరీక్షలకు ఏర్పాట్లు చేయండి

కోవిడ్ పరీక్షలకు ఏర్పాట్లు చేయండి