
ఉత్తమ టీడీపీ కార్యకర్త.. మన ఫీల్డ్ అసిస్టెంట్..!
చిత్రంలో రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్, పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర చేతుల మీదుగా ఉత్తమ టీడీపీ కార్యకర్త అవార్డు అందుకుంటున్న వ్యక్తి పేరు ఎస్.లోకేశ్. ఈయన జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో పార్వతీపురం మండలం సూడిగాం గ్రామ ఫీల్డు అసిస్టెంట్గా పనిచేస్తున్నారు. ప్రజాధనాన్ని నెలనెలా జీతంగా తీసుకుంటున్న ఉద్యోగి పార్టీ ఉత్తమ కార్యకర్తగా ప్రశంసా పత్రం తీసుకోవడం, సాక్షాత్తూ సీఎం కుమారుడే దానిని అందజేయడం ఇప్పుడు జిల్లా ఉద్యోగవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. వాస్తవంగా ఉద్యోగులు రాజకీయ పార్టీలకు అతీతంగా పనిచేయాలన్నది నిబంధన. పార్వతీపురం మండలం చినబొండపల్లిలో సోమవారం మంత్రి లోకేశ్ నిర్వహించిన పార్టీ శ్రేణుల అంతర్గత సమావేశంలో ఫీల్డు అసిస్టెంట్ పాల్గొని ఉత్తమ కార్యకర్తగా ప్రశంసలు అందుకోవడం గమనార్హం. దీనిని ప్రజాసంఘాల నాయకులు తప్పుబడుతున్నారు. పార్టీ కార్యకర్తలు ఫీల్డు అసిస్టెంట్ ఉద్యోగం ఎలా చేస్తారని ప్రశ్నిస్తున్నారు. తక్షణమే జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ఆయనను విధుల నుంచి తొలగించాలని, లేదంటే పోరుబాట సాగిస్తామని హెచ్చరించారు. ఉపాధిహామీ పనుల్లో టీడీపీ ప్రలోభాలకు ఈ చిత్రమే సజీవ సాక్ష్యంగా పేర్కొన్నారు. – పార్వతీపురం రూరల్