నరసరావుపేట: పల్నాడు జిల్లాను అక్షరాస్యతలో అగ్రస్థానంలో నిలబెట్టేందుకు అన్నీ శాఖలు కలిసికట్టుగా కృషిచేయాలని జిల్లా రెవెన్యూ అధికారి నారదముని పిలుపునిచ్చారు. మంగళవారం కలెక్టరేట్లో ’అక్షర ఆంధ్ర–ఉల్లాస్’ కార్యక్రమం జిల్లా సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. డీఆర్ఓ మాట్లాడుతూ ప్రతి ఒక్కరి సమష్టి కృషితోనే జిల్లాలో నిరక్షరాస్యతను నిర్మూలించగలమని అన్నారు. ఈ ఏడాదికి మొత్తం 1,39,168 మంది నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చడమే లక్ష్యంగా పెట్టుకున్నామని ప్రకటించారు. జిల్లా ప్రగతికి నిరక్షరాస్యత ఒక పెద్ద అవరోధంగా మారిందని, దీనిని అధిగమించేందుకు స్వయం సహాయక సంఘాల్లోని నిరక్షరాస్యులైన ప్రతి మహిళను గుర్తించి వారిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రతి ఒక్క నిరక్షరాస్యుడిని అక్షరాస్యుడిగా మార్చేందుకు మెప్మా, డ్వామా, డీఆర్డీఏ శాఖల సహాయ సహకారాలు కావాలన్నారు. అక్షర ఆంధ్ర – ఉల్లాస్ కార్యక్రమం నిరక్షరాస్యులకు ఒక గొప్ప సువర్ణావకాశమని, జూలై 7వ తేదీ నుంచి జిల్లావ్యాప్తంగా ఉల్లాస్ అక్షర ఆంధ్ర తరగతులు ప్రారంభం కానున్నాయని వెల్లడించారు. మెప్మా పీడీ మురళీకృష్ణ, ఐసీడీఎస్ పీడీ ఉమాదేవి, డీపీఓ నాగేశ్వర నాయక్, డీఆర్డీఏ ఏపీడీ రాంబాబు, జీఎస్డబ్ల్యూఎస్ అధికారి గోపి, సీపీఓ రాజు పాల్గొన్నారు.
జిల్లా రెవెన్యూ అధికారి నారదముని


